శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (15:01 IST)

జడ్జికి 12 ప్యాకెట్లు కండోమ్‌లు పంపిన మహిళా కార్యకర్త..

వివాదాస్పద 'స్కిన్‌-టూ-స్కిన్‌' తీర్పును వెలువరించి ప్రజాగ్రహాన్ని మూటగట్టుకున్న బాంబే హైకోర్టు న్యాయమూర్తి పుష్ప గనేదివాలాకు గుజరాత్‌ నుంచి ఓ రాజకీయ విశ్లేషకురాలు షాక్‌ ఇచ్చారు. పుష్ప ఉత్తర్వులు సమాజంలో నేరగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపుతాయని పేర్కొంటూ దేవ్‌శ్రీ త్రివేది అనే మహిళ ఆ న్యాయమూర్తికి కండోమ్‌ల ప్యాకెట్‌ పంపడం కలకలం రేపింది. 
 
యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన వీడియోలో దేవ్‌శ్రీ త్రివేది దాదాపు 150 కండోమ్‌లను 12 ప్యాకెట్లలో అమర్చి వాటిని నాగపూర్‌లోని పలు చిరునామాలకు, హైకోర్టు రిజిస్ట్రార్‌, న్యాయమూర్తి అధికార నివాసానికి పంపారు. ముంబైలోని హైకోర్టు ప్రధాన బెంచ్‌కు సైతం దేవ్‌శ్రీ కొన్ని ప్యాకెట్లను పంపారు. నాగ్‌పూర్‌లోని హైకోర్టు రిజిస్ట్రీ వద్ద హరిదాస్‌ అనే వ్యక్తి తాను పంపిన ప్యాకెట్లను తీసుకున్నారని మహిళ పేర్కొన్నారు. 
 
కాగా, ఇది తమ పరిధిలో లేని విషయమని దీనిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోమని హైకోర్టు రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌) సంజయ్‌ భరూక తెలిపారు. అయితే ఇది న్యాయమూర్తి ప్రతిష్టకు భంగకరమని న్యాయవాది శ్రీరంగ్‌ భండార్కర్‌ వ్యాఖ్యానించారు. రిజిస్ట్రీ మహిళపై చర్యలు చేపట్టని పక్షంలో న్యాయవాదులు ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారని చెప్పారు. 
 
కాగా, బాలిక దుస్తులు తొలగించకుండా స్కిన్‌ టూ స్కిన్‌ కాంటాక్ట్‌ లేకుంటే దాన్ని పోక్సో చట్టం కింద లైంగిక వేధింపులుగా పరిగణించలేమని పన్నెండేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి పుష్ప జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. న్యాయమూర్తి ఉత్తర్వులు విస్మయం కలిగించేలా ఉన్నాయని, బాలిక ఆమె కుటుంబం అనుభవించే మనోవేదన అర్ధం చేసుకోవాలని దేవ్‌శ్రీ త్రివేది వ్యాఖ్యానించారు.