1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

వీడియో తీసిన వ్యక్తిని రావణుడితో పోల్చిన బీజేపీ ఎంపీ

భారతీయ జనతా పార్టీలోని వివాదాస్పద ఎంపీలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఒకరు. ఈమె తాజాగా కబడ్డీ ఆడుతుండగా ఎవరో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ అయింది. ఈ విషయం ఆమెకు తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోతూ, ఆ వీడియో తీసిన వ్యక్తిని శపించారు. వీడియో తీసినవారు వచ్చే జన్మలో నాశనమైపోతారంటూ శపించారు. అంతేకాకుండా, ఆ వ్యక్తిని రావణుడితో పోల్చారు. 
 
గత శుక్రవారం రాత్రి భోపాల్‌లోని సింధి వర్గం ఏర్పాటు చేసిన దుర్గా పూజలో ఎంపీ ప్రజ్ఞా సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీల్లో యువకులతో సరదాగా ఆడారు. ఆమె కూతకు వెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. 
 
మాలెగావ్ పేలుళ్ల కేసు నిందితురాలైన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అనారోగ్య కారణాలతో బెయిలుపై విడుదలయ్యారు. తాను వీల్‌చైర్‌కే పరిమితమైనట్టు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె కబడ్డీ కూతకు వెళ్లిన వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. 
 
ఆమె అసలు రూపం ఇదేనంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా ఎద్దేవా చేశారు. కాగా, తాను కబడ్డీ కూతకు వెళ్లిన వీడియో వైరల్ కావడంపై ప్రజ్ఞాసింగ్ స్పందించారు. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిని రావణుడితో పోల్చారు. 
 
అతడు వృద్ధాప్యంలో, వచ్చే జన్మలో నాశనమైపోతాడని శపించారు. మరోవైపు, ప్రజ్ఞా సింగ్ సోదరి ఉప్మా ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రజ్ఞాసింగ్‌కు వెన్నెముక సమస్య అలానే ఉందని, అది ఎప్పుడైనా తీవ్రంగా మారే అవకాశం ఉందని అన్నారు.