1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (11:59 IST)

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో రాష్ట్రపతికి ఆహ్వానం ఎక్కడ: మంత్రి ఉదయనిధి

udayanidhi stalin
తమిళనాడు మంత్రి, డీఎంకే యువ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ మరోమారు వార్తలకెక్కారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం దక్కలేదని ఆయన గుర్తు చేశారు. 
 
రాష్ట్రపతి ముర్ము గిరిజన మహిళ కావడం, ఆమె భర్త చనిపోయి విధవంగా ఉండటమే ఇందుకు కారణమని ఆయన అన్నారు. సనాతన ధర్మం అంటే ఇదేనని ప్రశ్నించారు. రూ.800 కోట్ల ఖర్చుతో కట్టిన నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి తొలి పౌరురాలైన రాష్ట్రపతికి ఆహ్వానం దక్కక పోవడం విచారకరమన్నారు. 
 
మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభళో ప్రవేశపెట్టిన సమయంలో హిందీ నటీమణులనూ ఆహ్వానించారని చెప్పారు. కానీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాత్రం వ్యక్తిగత కారణాల పేరిట దూరంగా ఉండిపోవాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. సనాతన ధర్మం ప్రభావానికి ఇలాంటి ఘటనలు సూచికలని చెప్పుకొచ్చారు.
 
అంతేకాకుండా సమాజంలోని అంటరానితనం రూపుమాసిపోవాలంటే సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిందేనని ఆయన గుర్తు చేశారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ అంటరానితనం ఉందని ఆయన చెప్పారు.