1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (15:17 IST)

ఏమాత్రం ప్రభావం చూపని ప్రియాంకా గాంధీ - కాంగ్రెస్ చిత్తుగా ఓటమి

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అంతా తానే నడుచుకున్నారు. ఎన్నికలకు ముందునుంచే ఆమె అక్కడ తిష్టవేసి అతిపెద్ద రాష్ట్రాన్ని చుట్టేశారు. కానీ, గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ప్రియాంకా చేసిన ప్రచారానికి ఏమాత్రం ఓట్లు పడలేదు. దీంతో ఎన్నికల్లో ప్రియాంకా ప్రభావం అంతంతమాత్రమేనని తేలిపోయింది. 
 
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో బీజేపీ 263 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, సమాజ్‌వాదీ పార్టీ 135 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అయితే, కాంగ్రెస్, కేవలం 2 చోట్ల, బీఎస్పీ ఒక చోట, ఇతరులు రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఫలితాలను విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రియాంకా గాంధీ ప్రచారం ఏమాత్రం పని చేయలేదని తేలిపోయింది. 
 
కాంగ్రెస్ పార్టీ కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీల్లోనూ హస్తం నేతలకు ఓటమి తప్పలేదు. మరోవైపు, ఎస్పీ మాత్రం కాస్త పుంజుకుందనే చెప్పాలి. అదేసమయంలో బీజేపీ తిరిగి అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ సీట్లు మాత్రం 15కి పైగా తగ్గాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 280 సీట్లలో గెలుపొందగా ఇపుడు 263కే పరిమితమైంది.