సోమవారం, 29 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ప్రియుడిని పెళ్లాడేందుకు యువతి కిడ్నాప్ డ్రామా.. బెడిసికొట్టి జైలుపాలు...

ఓ యువతి తాను ప్రేమించిన యువకుడిని పెళ్లాడేందుకు ఓ కిడ్నాప్ నాటకమాండంది. తన బంధువులకు చెందిన బాలికను కిడ్నాప్ చేసింది. ఈ కిడ్నాప్ పథకం విఫలం కావడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నిషు ద్వివేదీ అనే 20 ఏళ్ల యువతి, ఓ యువకుడితో కొంతకాలంగా ప్రేమ కొనసాగిస్తూ వస్తోంది. అతన్ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్న ఆమె, అందుకు మాస్టర్ ప్లాన్ వేసింది.
 
తమ బంధువులకు చెందిన ఓ మూడేళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసింది. ప్రియుడితో పెళ్లి కావడానికి కొంత సమయం పడుతుందన్న ఆలోచనలో ఉన్న ఆమె, హోటల్లో అతనితో కలసి ఉండాలంటే, ఎవరికీ అనుమానం రాకుండా చూసుకోవాలని, అందుకు తన పక్కనే పాప ఉంటే బాగుంటుందని భావించింది. 
 
అయితే, పాప కనిపించక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, పాప గురించి వెతుకులాట ప్రారంభించారు. వీరిద్దరినీ జలంధర్‌లోని ఓ హోటల్‌లో గుర్తించి, పాపను రక్షించారు. 
 
తాను పాపను కేవలం రక్షణ కోసమే తెచ్చుకున్నానని, హాని తలపెట్టే ఉద్దేశం తనకు లేదని నిషు ద్వివేది పోలీసుల విచారణలో వెల్లడించిందట. ఇక వారిద్దరిపై కిడ్నాస్ సహా పలు సెక్షన్ల కింద కేసు పెట్టిన పోలీసులు, విచారణ జరుపుతున్నారు.