1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2019 (17:48 IST)

ప్రమాణస్వీకారంలో పుస్తకాలివ్వండి: హేమంత్ సోరెన్

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ హేమంత్ సోరెన్ ప్రజలకు ఒక విన్నపం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత తనకు పుష్పగుచ్ఛాలకు బదులుగా పుస్తకాలను ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు.

‘మీరు ఎంతో ప్రేమతో ఇచ్చే పువ్వులను నేను జాగ్రత్తగా చూసుకోలేను మరియు అవి ఎక్కువ రోజులు కూడా ఉండవు. అదే మీరు పుస్తకాలు ఇచ్చనట్లయితే వాటిన్నంటిని ఒక లైబ్రరీలో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటాను. మీరిచ్చే పుస్తకాలపై మీ పేరు కూడా రాయండి. ఎందుకంటే ఆ పుస్తకాలు చదివేవారికి అవి ఎవరిచ్చారో కూడా తెలియాలి’ అని ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
 
జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ డిసెంబర్ 29, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము హేమంత్ సోరేన్ చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, చిదంబరం, అహ్మద్ పటేల్ హాజరుకానున్నారు.
 
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఛత్తీస్‌ఘర్ సీఎం భూపేష్ భగెల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్‌‌లు సీఎంల హోదాలో హాజరుకానున్నారు.
 
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఉత్తరాఖండ్ మాజీ సిఎం హరీష్ రావత్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, బిఎస్‌పీ చీఫ్ మాయావతి, డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్, ఆర్జెడీ లీడర్ తేజస్వీ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
 
హేమంత్ సోరెన్ డిసెంబర్ 24న రాజ్ భవన్‌లో గవర్నర్‌ ముర్మును కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించవలసిందిగా కోరుతూ తనకున్న 50 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు సమర్పించారు. జెఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ మూడు పార్టీల కూటమి 81 అసెంబ్లీ స్థానాలలో 47 స్థానాలను దక్కించుకుంది.

జేవీఎం తన ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సోరెన్‌కు బేషరతుగా మద్దతును ప్రకటించింది.