శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (10:20 IST)

ప్రపంచంతో మాట్లాడాలంటే హిందీతో సాధ్యం కాదు.. రాహుల్ గాంధీ

rahul gandhi
ప్రపంచ ప్రజలతో మాట్లాడలన్నా.. తమ ప్రతిభతో ప్రపంచంలో రాణించాలన్నా హిందీతో సరిపోదని, ఇంగ్లీష్ బాష తప్పని సరి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇంగ్లీష్‌ను తీవ్రంగా వ్యతిరేకించే కేంద్ర హో మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు మాత్రం వారి పిల్లలను ఎందుకు అంగ్ల మీడియంలో చదివిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 
 
తాను చేపట్టిన భారత్ జోడో యాత్రలోభాగంగా, సోమవారం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, నువ్వు ఏం చేస్తున్నావ్.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎందుకు నడుస్తున్నావ్ అంటూ బీజేపీ నేతలంతా నన్ను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారందరికీ తాను చెప్పే సమాధానం ఒక్కటే. ద్వేషపూరితం చేసే ఓ మార్కెట్‌లో ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచానని వారికి చెబుతున్నానని తెలిపారు.
 
మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, నెహ్రూ, ఆజాద్ వంటి నేతలందరూ ఇలాంటి ప్రేమను పంచారని, ఇపుడు తాను వారి బాటలోనే పయనిస్తున్నట్టు చెప్పారు. రాజస్థాన్ మంత్రులు, ప్రజాప్రతినిధులు నెలలో ఒక్కరోజైనా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. 
 
ఇకపోతే, బీజేపీ నేతల హిందీ ప్రచారంపై ఆయన స్పందిస్తూ, హిందీ, తమిళం, ఇతర భాషలు చదవొద్దని తాను చెప్పడం లేదన్నారు. అయితే, ప్రపంచంలో ఇతరులు ఎవరితోనైనా మాట్లాడాలంటే అది ఒక్క హిందీతోనే సాధ్యం కాదని, ఇంగ్లీష్‌తోనే సాధ్యమవుతుందని రాహుల్ గాంధీ అన్నారు.