1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 మే 2024 (09:53 IST)

ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసేందుకు దేవుడు మోడీని పంపాడు : రాహుల్ సెటైర్

rahul gandhi
ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసేందుకు దేవుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమిపైకి పంపించారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ఓ లక్ష్యం కోసం తనను ఆ దేవుడే పంపాడని, తనను తాను దేవుడికి అంకితం చేసుకుంటున్నానని ప్రధాని మోడీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
పేదలకు కాకుండా, ఓ బిజినెస్‌మేన్‌కు సాయపడేందుకే మోడీని దేవుడు పంపి ఉంటారని ఎద్దేవా చేశారు. మోడీ దేశంలో 22 మంది బిలియనీర్లను తయారు చేశారని, వారికి సంబంధించి రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో మోడీని జాతి ఎప్పటికీ క్షమించబోదని రాహుల్ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక కోట్లాది మందిని లక్షాధికారుల స్థాయికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
 
ప్రధాని మోడీ పోటీ చేస్తున్న వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇవాళ ఇండియా కూటమి సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, జూన్ 4 తర్వాత మోడీ ప్రధాని కాబోరని, ఇది తన హామీ అని అన్నారు. వారణాసిలో కాంగ్రెస్ బలపరిచిన అజయ్ రాయ్ విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండబోతోందని అభిప్రాయపడ్డారు. ఈ సభలో సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా పాల్గొన్నారు.