1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (18:31 IST)

11 యేళ్ళ విద్యార్థినిపై టీచర్ లైంగికదాడి.. ఎక్కడ?

దేశంలో పింక్ సిటీగా గుర్తింపు పొందిన జైపూర్‌లో ఏడో తరగతి చదివే 11 యేళ్ళ బాలికపై ఓ టీచర్ లైంగికదాడికి తెగబడ్డాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌కు సమీపంలో ఝున్‌ఝన్‌హు జిల్లాలో ఈ దారుణం జరిగింది. 11 ఏండ్ల బాలికపై 31 ఏండ్ల టీచర్‌ పాఠశాల ముగిసిన తర్వాత ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. దీంతో బాధితురాలు కొన్ని రోజులు మౌనం వహించింది. అయితే తరగతి పుస్తకంలోని చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ను చూసిన ఆ బాలిక గురువారం ఫోన్‌ చేసింది. 
 
జరిగిన దారుణం గురించి చెప్పింది. దీంతో పిల్లల సంరక్షణ కమిటీ సభ్యులు ఆ బాలిక ఇంటికి వచ్చారు. టీచర్‌ లైంగిక దాడి గురించి ఎస్పీకి తెలిపారు. నిందితుడు ఆమెకు కొంత కాలంగా అసభ్య సందేశాలు పంపుతున్నట్లు చెప్పారు.
 
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అల్వార్ జిల్లాలో కుటుంబంతో కలిసి ఉన్న కీచక ఉపాధ్యాయుడిని  గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడి కుటుంబమంతా విద్యావంతులని, అతడి భార్య కూడా మరో జిల్లాలో టీచర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.