శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (12:14 IST)

భూలోకంలో చంద్రమండలం... భార్యకు కానుకగా చందమామపై ఇంటి స్థలం!

వారిద్దరూ అపురూపమైన దంపతులు. వారికి వివాహం ఏడేళ్లు పూర్తయింది. ఈ నెల 24వ తేదీన తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ పెళ్లి రోజు సందర్భంగా భార్యకు ఆ భర్త అపురూపమైన కానుక ఇచ్చాడు. భూమిపై నివసించే ఏ ఒక్క భర్త ఇవ్వనటువంటి కానుకను ఇచ్చాడు. అలాంటి కానుక ఏమైవుంటుందనే కదా మీ సందేహం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని ఆజ్మీర్‌కు చెందిన ధర్మేంద్ర అనిజ - సప్నా అనిజ అనే దంపతులు ఉన్నారు. వీరు డిసెంబరు 24న తమ వివాహ ఎనిమిదో వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాను ఎంతగానో ప్రేమించే భార్య కోసం ఏదైనా అద్భుతమైన బహుమతి ఇవ్వాలని ధర్మేంద్ర భావించారు. 
 
అంతే... చందమామపై తన సతీమణికి కానుకను ఇచ్చారు. పెళ్లి రోజున తన జీవిత భాగస్వామికి చంద్రునిపై స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు. దీనిపై ధర్మేంద్ర మాట్లాడుతూ, తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన ప్రేయసికి ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకున్నాను.
 
చాలా మంది ఈ భూమి మీద ఉన్న కార్లు, బంగారం వంటి వాటిని బహుమతులుగా ఇస్తూ ఉంటారని, అందువల్ల ఏదైనా ప్రత్యేకత చూపించాలని భావించాను. అందుకే చంద్రునిపై మూడెకరాల స్థలాన్ని కొన్నానని చెప్పారు. లూనా సొసైటీ ఇంటర్నేషనల్ ద్వారా ఈ స్థలాన్ని కొన్నానని, దీనికి అవసరమైన ప్రక్రియ పూర్తి కావడానికి ఒక సంవత్సరం పట్టిందన్నారు. 
 
అలాగే, సప్నా అనిజ మాట్లాడుతూ, తనకు తన భర్త అనూహ్యమైన బహుమతి ఇచ్చారని తెలిపింది. ప్రపంచానికి అతీతమైన బహుమతిని తన భర్త నుంచి తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. చంద్రునిపై స్థలాన్ని బహుమతిగా పొందడం తనకు చాలా సంతోషకరమన్నారు. 
 
తన భర్త ఇంత గొప్ప బహుమతి తనకు ఇస్తారని ఊహించలేదన్నారు. ప్రొఫెషనల్ ఈవెంట్ ఆర్గనైజర్లతో వైభవంగా ఏర్పాట్లు చేయించి, పార్టీ ఇచ్చినట్లు తెలిపారు. నమ్మశక్యం కానటువంటి సెట్టింగ్స్ వేసినట్లు తెలిపారు. నిజంగా చంద్రునిపైనే ఉన్నామన్నంత అనుభూతి కలిగిందన్నారు.