శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (10:41 IST)

ముహూర్తం కుదిరింది : ఎంజీఆర్ జయంతి రోజున 'బాషా' కొత్త పార్టీ

తమిళనాడు రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన ఈ నెలాఖరులో తన కొత్త పార్టీ ఏర్పాటుపై ఓ ప్రకటన చేయనున్నారు. పిమ్మట కొత్త సంవత్సరం పుట్టిన తర్వాత అంటే జనవరిలో తన పార్టీని స్థాపించనున్నారు. 
 
అయితే, రజనీకాంత్ స్థాపించనున్న కొత్త పార్టీ పేరు మక్కల్ సేవై కట్చి అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ డిసెంబ‌ర్ 31న పార్టీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ప్ర‌స్తుతం పార్టీ జెండా, అజెండా, గుర్తుకు సంబంధించి తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ట‌. జ‌న‌వ‌రి 14 లేదా 17 తేదీల‌లో పార్టీ లాంచింగ్ ఉంటున్న‌ట్టు తెలుస్తుంది.
 
త‌మిళ పొంగ‌ల్ సంద‌ర్భంగా జ‌న‌వరి 14న ర‌జ‌నీకాంత్ త‌న పార్టీ లాంచ్ చేస్తాడ‌ని కొంద‌రు అంటుంటే మ‌రి కొంద‌రు ఎంజీఆర్ జ‌యంతి రోజు అంటే జ‌న‌వ‌రి 17న లాంచ్ చేయాల‌ని సూచిస్తున్నారు. దాదాపు జ‌న‌వ‌రి 17 ఫైన‌ల్ అయ్యేలా క‌నిపిస్తుంది. అదీకూడా ఆలయాల పట్టణంగా పేరుగాంచిన మదురైలో తన కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించనున్నారు. 
 
ర‌జ‌నీకాంత్ త‌న పార్టీకి కొత్త పేరు కాకుండా ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన 'మక్కల్ సేవై కట్చి' (ప్రజాసేవ పార్టీ)ని తీసుకుంటున్నట్టు స‌మాచారం. పార్టీ సింబల్‌గా ఆటో రిక్షా కోసం దరఖాస్తు చేశారు. రాష్ట్రం మొత్తం పోటీ చేస్తామని, అన్ని చోట్లా ఒకటే గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.