శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (15:51 IST)

వైరస్‌ను గుర్తించేందుకు 1 లేదా 2 రోజులు లాక్డౌన్ అమలు చేద్దాం : మోడీ సలహా

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి సంక్రమణను అడ్డుకునేందుకు మరోమాలు లాక్డౌన్ అమలు చేయబోతున్నారా? దేశంలో మళ్లీ లాక్డౌన్ అమలు చేసే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ మనసులో ఏమనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు ఆయన ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సమాధానం లభించింది. దేశంలో మరోమారు లాక్డౌన్ తప్పదనే సంకేతాలు వెల్లడించారు. అయితే, రోజుల తరబడికాకుండా ఒకటి లేదా రెండు రెజులు పాటు మాత్రమే ఈ లాక్డౌన్ అమలు చేద్దామని, ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు పరిశీలించాలని ఆయన కోరారు. 
 
దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఇదేసమయంలో తరచుగా 1 నుంచి 2 రోజుల లాక్డౌన్‌ను రాష్ట్రాల్లో కఠినంగా అమలు చేస్తే, వైరస్ ఎవరిలో ఉందన్న విషయం బయటకు వచ్చేస్తుందని, దాని ద్వారా వైరస్‌ను అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
 
ముఖ్యంగా, స్వల్ప కాల వ్యవధుల్లో మరోమారు సంపూర్ణ లాక్డౌన్‌ను విధించే అంశాన్ని అన్ని రాష్ట్రాలూ పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. దేశంలో రోజుకు దాదాపు లక్ష వరకూ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్న వేళ, కరోనా ఎవరిలో ఉందన్న విషయాన్ని ట్రేస్ చేయాలంటే, మరోమారు లాక్డౌన్‌ను విధిస్తే బాగుంటుందని, ఈ విషయమై రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని మోడీ సూచించారు. 
 
'లాక్డౌన్‌తో మేలే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది నిరూపితం. లాక్డౌన్ మంచి నిర్ణయమని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, ఇప్పుడిక మైక్రో కంటైన్మెంట్ జోన్లపై మరింత దృష్టిని సారించాలి. అక్కడి నుంచే వైరస్ వ్యాపిస్తోంది. ఒకటి నుంచి రెండు రోజుల లాక్డౌన్‌పై రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే, ఆర్థిక వ్యవస్థ కూడా పెద్దగా ప్రభావితం కాబోదు. అన్ని రాష్ట్రాలకూ నా సలహా ఇదే. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిశీలించాలి. టెస్టింగ్, ట్రీటింగ్, నిఘా పెట్టడం తదితర విషయాలపై మన దృష్టిని పెట్టాలి' అని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఈ సమావేశంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దేశంలోని మొత్తం కేసుల్లో 63 శాతం ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 77 శాతం మరణాలు కూడా ఈ రాష్ట్రాల్లోనే సంభవించాయి. ఈ రాష్ట్రాలన్నీ ఆక్సిజన్ నిల్వలను పెంచుకోవాలని, రోగులకు ఆక్సిజన్ కొరతను రానివ్వకుండా చూసుకోవాలని కూడా ప్రధాని నరేంద్ర మోడీ సూచన చేశారు.