శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (17:28 IST)

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.517 కోట్లు

దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచాన్ని చుట్టేశారు. ముఖ్యంగా, మన దేశానికి చెందిన ఏ ఒక్క ప్రధాని కూడా తిరగనన్ని దేశాలు చుట్టేశారు. గత 2015 నుంచి ఇప్పటివరకు ఏకంగా 58 దేశాల్లో పర్యటించారు. దీనికి కారణంగా ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం విదేశాంగ విధానానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు.. ఇతర దేశాలతో బలమైన స్నేహ సంబంధాలు కోరుకోవడమే. ఇందుకోసం మోడీ విదేశీ ఈపర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అయిన ఖర్చు రూ.517.82 కోట్లు. ఈ విషయాన్ని రాజ్యసభలో వచ్చిన ఓ ప్రశ్నకు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ అత్యధికంగా అమెరికా, రష్యా, చైనా దేశాల్లో ఐదేసి సార్లు పర్యటించారని వివరించారు. అంతేకాకుండా, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, యూఏఈ, శ్రీలంక దేశాలకు కూడా వెళ్లారని తెలిపారు. ప్రధాని పర్యటనల్లో కొన్ని బహుళ దేశ పర్యటనలు కాగా, కొన్ని ద్వైపాక్షిక పర్యటనలని వివరించారు. చివరిసారిగా ప్రధాని బ్రెజిల్‌లో పర్యటించి బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్నారని తెలిపారు. 
 
అదే నెలలో ఆయన థాయ్‌లాండ్‌లోనూ పర్యటించినట్టు వెల్లడించారు. ప్రధాని పర్యటనల వల్ల ఆర్థిక సంబంధాలు బలోపేతం అయ్యాయని, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక, రక్షణ, సహకార రంగాల్లో ఆయా దేశాలతో పటిష్ట సంబంధాలు ఏర్పడ్డాయని వివరించారు.