గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (09:33 IST)

కోల్‌కతా మెడికో హత్యాచార కేసు కీలక ట్విస్ట్ : పోలీస్ కమిషనర్‌పై వేటు

mamata benerjee
కోల్‌కతా మెడికో హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన్ను బదిలీ చేసింది. ఈ హత్యాచార ఘటనపై కోల్‌కతాలో దాదాపు నెల రోజులుగా జూనియర్ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలన్న డిమాండ్‌తో పాటు డిమాండ్ల పరిష్కారం కోసం వారు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో వారితో చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరిసారిగా చర్చలకు ఆహ్వానించారు. దీంతో తలొగ్గిన జూడాలు... పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ఐదోసారి చర్చలు జరిపారు. 
 
ఈ చర్చల్లో మొత్తం 42 మంది వైద్యుల బృందం ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి చర్చలు జరిపింది. దాదాపు ఆరు గంటలకుపైగా జూనియర్ వైద్యులతో సోమవారం రాత్రి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మమతా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైద్యుల డిమాండ్ మేరకు కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్, ఆరోగ్య సేవల డైరెక్టర్ దేబాసిన్ హల్డర్, వైద్య విద్య డైరెక్టర్ కౌస్తవ్ నాయక్‌లను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ముందుగా కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్‌పై బదిలీ వేటు పడింది. 
 
కాగా, విద్యార్థులతో సమావేశం అనంతరం మాట్లాడిన సీఎం మమతా బెనర్జీ.. వైద్య విద్యార్థులతో భేటీ సానుకూలంగా జరిగిందన్నారు. వారి డిమాండ్లలో 99 శాతం అంగీకరించినట్లు చెప్పారు. విద్యార్థుల ఐదు డిమాండ్లలో మూడింటిని అంగీకరించినట్లు పేర్కొన్నారు. అయితే, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్‌ను తొలగించేందుకు సీఎం అంగీకరించలేదు.
 
ఆరోగ్య కార్యదర్శిని తొలగిస్తే ఆరోగ్య రంగంలో ఒక్కసారిగా అనిశ్చితి నెలకొంటుందని, ఈ విషయం విద్యార్థులతో చెప్పినట్లు ఆమె వివరించారు. మంగళవారం సాయంత్రం కొత్త పోలీస్ కమిషనర్‌ను నియమిస్తామని వెల్లడించారు. ఐదో డిమాండ్ అయిన వైద్య విద్యార్థిని హత్యాచార విచారణ అంశం తమ పరిధిలో లేదని, సీబీఐ విచారణ జరుపుతోందని, సుప్రీంకోర్టులో ఉందని చెప్పారు.
 
ఇక వైద్యుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించినందున ఆందోళన విరమించి వెంటనే విధుల్లో చేరాలని సీఎం సూచించారు. వైద్య విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని తెలిపారు. అలాగే ఆరోగ్య రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం కోసం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం మాట్లాడిన జూనియర్ డాక్టర్లు ఇది తమ నైతిక విజయంగా పేర్కొన్నారు.