1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (13:48 IST)

మహారాష్ట్రలో కరోనా ఉధృతి: కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి.. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌కు కోవిడ్ పాజిటివ్

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఈ వైరస్‌ అందరికి సోకుతోంది. ఇప్పటికే పలువురు సీఎంలను, కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను.. ఉన్నతాధికారులను ఇలా ఎవ్వరు దొరికితే వాళ్లు అనే తరహాలో కరోనా వైరస్ సోకింది. 
 
ఇక, ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్‌లో గత రికార్డులను బ్రేక్ చేస్తూ.. కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు కరోనా సోకింది. ఇటీవలే మోహన్‌ భగవత్‌ కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో భగవత్‌కు తేలికపాటి లక్షణాలు కనిపించగా.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఆర్‌ఆర్‌ఎస్‌ శుక్రవారం వెల్లడించింది. అంతేకాదు.. నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మోహన్‌ భగవత్‌ చేరారని పేర్కొంది ఆర్‌ఎస్‌ఎస్‌ బృందం.
 
మహారాష్ట్ర కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. కరోనా బారిన పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే రావు సాహెబ్ అంతపుర్కర్(64) మరణించారు. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత ముంబైలోని ఓ ఆస్పత్రిలో రావు సాహెబ్ చేరి చికిత్స పొందారు. 
 
ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆయన పరిస్థితి విషమించడంతో.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నాందేడ్ జిల్లాలోని డేగ్లూరు నియోజకవర్గం నుంచి రావు సాహెబ్ గెలుపొందారు.
 
మార్చి 19న రావు సాహెబ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో నాందేడ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. మెరుగైన చికిత్స నిమిత్తం మార్చి 22న ముంబై ఆస్పత్రిలో చేరారు. మార్చి 28న ఆయనకు కరోనా నెగిటివ్ నిర్ధారణ అయింది. కానీ ఆయన ఐసీయూలోనే ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఊపిరితిత్తులు, కిడ్నీలు పాడవడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందారు.