1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (10:48 IST)

తల్లి శవంతో యేడాది కాలంగా అక్కా చెల్లెళ్లు... ఎక్కడ?

deadbody
తల్లి చనిపోయినప్పటికీ.. కన్నతల్లిపై ఆ అక్కా చెల్లెళ్లకు ప్రేమ చనిపోయేలేదు. దీంతో యేడాది కాలంగా తల్లి శవంతోనే ఆ సోదరీమణులు గడిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరంలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, వారణాసి నగరంలోని మదర్వా ప్రాంతానికి చెందిన ఉషా త్రిపాఠి తన ఇద్దరు కూతుళ్లు పల్లవి (27), వైశ్విక్‌ (17)లతో కలిసి ఓ ఇంట్లో జీవించేవారు. పల్లవి పీజీ పూర్తిచేయగా, వైశ్విక్‌ పదో తరగతి చదువుతోంది. రెండేళ్ల క్రితమే ఉషా భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆమె చిన్నదుకాణం నడుపుతూ జీవనం సాగించేది. గతేడాది డిసెంబరు 8న ఉషా అనారోగ్యంతో మృతిచెందింది. ఈ విషయాన్ని అక్కాచెళ్లెలిద్దరూ ఎవరికీ చెప్పలేదు. 
 
మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని.. కావలసిన వస్తువుల కోసం అప్పుడప్పుడు బయటకు వెళ్లి వచ్చేవారు. మీర్జాపుర్‌లో ఉంటున్న ధర్మేంద్రకుమార్‌ బుధవారం తన చెల్లి ఉషా త్రిపాఠిని చూసేందుకు వచ్చాడు. ఎంతసేపటికీ తలుపు  తీయకపోవడంతో అనుమానం వచ్చిన ధర్మేంద్ర పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూస్తే.. ఓ గదిలో మహిళ అస్థిపంజరం, మరో గదిలో అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఆ ఇద్దరి మానసిక పరిస్థితి సరిగా లేదని దర్యాప్తులో తేలింది. అయితే, తల్లి చనిపోయిన తేదీని గుర్తుంచుకోవడం కాస్త అనుమానంగా ఉందని పోలీసులు తెలిపారు. పల్లవి, వైశ్విక్‌లను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.