1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (16:43 IST)

వాంఛ తీర్చాలన్న తండ్రి.. కడతేర్చిన కుమార్తె.. ఎక్కడ?

తనకు శారీరక సుఖం ఇవ్వాలంటూ వేధించిన కన్నతండ్రిని ఓ కుమార్తె చంపేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విల్లుపురం జిల్లా కోవిల్‌పురాయూర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్‌ అనే దివ్యాంగుడు ఉన్నాడు. ఈయనకు భార్య మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు. అయితే, వెంకటేశ్‌ పెద్ద కుమార్తె చెన్నైలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా.. చిన్న కుమార్తె ఇంటి వద్దే ఉంటూ పదకొండో తరగతి చదువుతోంది.
 
ఈ క్రమంలో జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు కోసం వెళ్లి వచ్చిన వెంకటేశ్‌ తన ఇంట్లో విగతజీవిగా కనిపించాడు. బంధువులు, స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహంపై కత్తి పోట్లను బట్టి.. తొలుత రాజకీయ హత్యగా భావించారు.
 
అయితే కేసు నమోదు చేసిన పోలీసులు... లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెల్లడైంది. వెంకటేష్‌ను రెండో కుమార్తె హత్య చేసినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చి  ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ దర్యాప్తులో 'నా తండ్రి లైంగికంగా వేధించాడు.. ఆత్మరక్షణ కోసమే చంపేశాను' అని ఆమె చెప్పినట్లు డీఎస్పీ ఇళంగోవన్‌ తెలిపారు.
 
అనంతరం పోలీసులు బాలికను అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆత్మరక్షణ కోసం తండ్రిని చంపిన బాలికను వెంటనే విడుదల చేయాలని విల్లుపురం జిల్లా ఎస్పీ శ్రీనాథ ఆదేశించారు.