1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 డిశెంబరు 2019 (10:41 IST)

చిన్నారి పట్ల వైద్యుడి నిర్లక్ష్యం.. సూది మొన అక్కడ ఇరుక్కుపోయింది..

వైద్యులు ఏకాగ్రతతో చేయాల్సిన పని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. తాజాగా ఓ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ శిశువు నడుము తొంటి భాగంలో సూది ఇరుక్కుపోయింది. నొప్పితో చిన్నారి అల్లాడుతున్నా వైద్యులు పట్టించుకోలేదని శిశువు తల్లి ఆరోపించారు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. 
 
తమిళనాడులోని నామక్కల్ జిల్లా తిరుచెంగోడులో ఈ ఘటన చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే.. ఎట్టిమదైపూర్‌కి చెందిన రమీలా(26) ఇటీవల భర్త కార్తీకేయన్‌తో గొడవ కారణంగా కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లాక కొడుకు అనారోగ్యం బారిన పడటంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు చేసి సూది మందు ఇచ్చారు. అయితే సూది మందు ఇస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. సూది మొన కాస్త తొంటిలో ఇరుక్కుపోయింది.
 
దీంతో చిన్నారికి అక్కడ వాపు వచ్చింది. మరుసటి రోజు ఈ విషయాన్ని గమనించారు. కానీ చిన్నారికి వాపు ఎక్కువ కావడంతో రమీలా దానిపై గట్టిగా నొక్కడంతో.. సూది మొన బయటపడింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సదరు వైద్యులపై ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.