గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (19:31 IST)

దేశంలో 73 లక్షల మొబైల్ కనెక్షన్లు తొలగింపు... : పెమ్మసాని చంద్రశేఖర్

pemmasani
దేశంలో 73 లక్షల మొబైల్ కనెక్షన్లను తొలగించినట్టు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, నకిలీ గుర్తింపు కార్డులతో తప్పుడు మొబైల్ కనెక్షన్లు గుర్తించేవారిని గుర్తించేందుకు వీలుగా ఒక వ్యవస్థను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ (డాట్) రూపొందించిందని తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా 81 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్లను గుర్తించగా, రీవెరిఫికేషన్‌లో 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికాం కంపెనీలు రద్దు చేసినట్టు ఆయన సభకు తెలిపారు. వివరాల ధ్రువీకరణలో విఫలమైన కంపెనీలు, కనెక్షన్లను రద్దు చేశాయి. నకిలీ ఐడీలు లేదా అడ్రస్‌లతో తప్పుడు కనెక్షన్లు పొందిన వారిని గుర్తించేందుకు డాట్ ఒక వ్యవస్థని రూపొందించినట్లు ఈ సందర్భంగా కేంద్రం వెల్లడించింది.
 
'ఇప్పటివరకు 81 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్లను డాట్ గుర్తించింది. వాటిలో 73 లక్షల మొబైల్ కనెక్షన్లు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల వెరిఫికేషన్‌లో విఫలం కావడంతో డిస్కనెక్ట్ చేశాం' అని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలియజేశారు. అలాగే నకిలీ రుజువులతో సిమ్ కార్డులను యాక్టివేట్ చేయడానికి సంబంధించిన ప్రశ్నకు కూడా మంత్రి సమాధానమిచ్చారు. 
 
'పాన్-ఇండియా ప్రాతిపదికన అన్ని ఆపరేటర్లలో ఒక వ్యక్తి కలిగి ఉండే మొబైల్ కనెక్షన్ల నిర్ణీత పరిమితిని మించి దాదాపు 16 లక్షల మంది చందాదారులు కలిగి ఉన్న సుమారు 1.92 కోట్ల మొబైల్ కనెక్షన్లను డాట్ గుర్తించింది. వీటిలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు దాదాపు 66 లక్షల మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేశాయి. తద్వారా ఈ 16 లక్షల మంది చందాదారులకు మొబైల్ కనెక్షన్లను నిర్ణీత పరిమితిలోపు తీసుకురావడం జరిగింది' అని మంత్రి చెప్పారు.