శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2019 (19:00 IST)

విశ్వవిద్యాలయాల్లో మూగబోనున్న మొబైల్ ఫోన్లు

ఇటీవలి కాలంలో చదువుకునే విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు ఉన్నాలేకున్నా స్మార్ట్ ఫోన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఫలితంగా తరగతి గదుల్లో సెల్‌ఫోన్ రింగులు మోగుతూ ఉంటాయి. పైగా, నేటి యువత స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
రాష్ట్రంలోని అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ గురువారం సర్క్యులర్‌ జారీచేసింది. క్లాస్‌లు జరుగుతున్న సమయంలో చాలా మంది విద్యార్థులు మొబైల్‌ ఫోన్లపై దృష్టి పెట్టి.. అధ్యాపకులు చెప్పే విషయాలను పట్టించుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 
 
ఈ నిబంధనల ప్రకారం విద్యార్థులు ఇకపై యూనివర్సిటీ, కాలేజ్‌ల్లో పరిసరాల్లో మొబైల్స్‌ వాడేందుకు అవకాశం ఉండదు. మరీ ముఖ్యంగా ఈ నిబంధన బోధన సిబ్బందికి కూడా వర్తించనున్నట్టు ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు, అధ్యాపకులు తమ విలువైన సమయాన్ని ఎక్కువగా మొబైల్‌ ఫోన్ల వాడకానికి కేటాయిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.