గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (15:11 IST)

కట్నం కింద బైకు కొనిపెట్టలేదని.. కట్టుకున్న భార్యను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేశాడు..?

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కట్నం కింద బైకు కొనిపెట్టలేదనే అక్కసుతో ఓ దుర్మార్గుడు కట్టుకున్న భార్యను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. డబ్బులిస్తే మా ఆవిడ వద్దకు పంపిస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశాడు. బైక్ కోసం నీచంగా ప్రవర్తించాడు. యూపీలోని మెహ్‌నగర్ పీఎస్ పరిధిలోని తుథియా గ్రామంలో ఈ దారుణం జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. తుథియా గ్రామానికి చెందిన పునీత్ అనే వ్యక్తికి కొత్వాలీకి చెందిన మహిళతో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలోనే కట్నంతో పాటు బైక్ ఇస్తానని అత్తింటి వారు మాటిచ్చారు. ఐతే ఏడాదవుతున్నా ఇంకా బైక్ ఇప్పించకపోవడంతో.. భార్యను వేధించేవాడు పునీత్. ఈ విషయంలో ఇంట్లో నిత్యం గొడవలు జరిగేవి.
 
భర్త వేధింపులను తట్టుకోలేక ఇటీవలే భార్య తమ పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త భార్య  ఫొటోలు, ఫోన్ నెంబరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అమ్మకానికి పెట్టాడు. తనకు డబ్బులు చెల్లించి.. ఆమెతో గడవవచ్చంటూ ప్రచారం చేశాడు.
 
ఆమె వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అపరిచిత వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో కాల్స్ వెళ్లాయి. నిత్యం కాల్స్ రావడంతో బాధితురాలు విసిగిపోయింది. ఈ పని తన భర్తే చేశాడని తెలుసుకున్న ఆమె.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పునీత్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.