బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 6 ఆగస్టు 2019 (12:44 IST)

కశ్మీర్ పై లెక్చ‌ర‌ర్ ప్ర‌శ్న‌కి మైండ్ బ్లాక్ అయ్యే స‌మాధానం చెప్పిన వెంక‌య్య‌...

ఉపరాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు విద్యార్థి ద‌శ నుంచి ఉద్య‌మాల్లో చ‌రుకుగా పాల్గొనేవారు. ఎంత‌టి వారినైనా స‌రే.. ఎదిరించేవారు. విద్యార్ధి నాయ‌కుడుగా ఉన్న వెంక‌య్య ప్ర‌శ్నిస్తే... ఎదుటివారు స‌మ‌ధానం చెప్ప‌లేక‌పోయేవారు. అలా ఉండేది వెంక‌య్య నాయుడులో ప్ర‌శ్నించే గుణం. ఒక‌సారి వెంక‌య్య ప్ర‌శ్న‌కు లెక్చ‌ర‌రే స‌మాధానం చెప్ప‌లేక‌పోయార‌ట‌. 
 
ఇంకా చెప్పాలంటే... వెంక‌య్య ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేక లెక్చ‌ర‌ర్ మైండ్ బ్లాక్ అయ్యింద‌ట‌. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... ఆయన నెల్లూరులో విద్యార్థి నాయకుడుగా వున్నప్పుడు ధర్నాలు.. స్ట్రైక్‌లు.. అరెస్టులు ఆయనికి మామూలే. అలాగే ఒకరోజు తను చదువుతున్న  వీఆర్ కాలేజిలో తన క్లాస్‌నే బాయ్‌కాట్ చేస్తుండగా లెక్చరర్ ఆయన్ని ఇలా అడిగారట. ఒరేయ్ వెంకయ్య... దేనికి రా స్ట్రైక్ అని. కాశ్మీర్‌లో బాంబ్ పేలి అనేకమంది అమాయకులు చనిపోయారు సార్ అని నాయుడుగారు బదులిచ్చారు.
 
దానికి లెక్చరర్, నాయుడు గారిని మీదేవూరు అని అడిగారట. మాది కసుమూరు సార్ అని చెప్పారట వెంకయ్య. కాశ్మీర్‌లో బాంబ్ పేలితే కసుమూరోడికి నీకెందుకురా... పోయి చదువుకో పో అని మందలించారట సార్. అందుకు ధీటుగా నాయుడు గారు లెక్చరర్‌ని తిరిగి ప్రశ్నించారట.. సార్ మీ కాలికి దెబ్బ తగిలితే మీరేం చేస్తారు అని? ఆ ఎవరైనా ఏమి చేస్తారు.. కట్టు కట్టుకుంటారు అని ఆయన బదులిచ్చారు.
 
అందుకు నాయుడుగారు.. మీ కాలికి దెబ్బ తగిలితే మీ కన్నెందుకు చూడాలా.. నడుమెందుకు వంగాలా... చెయ్యేందుకు కట్టు కట్టాల అని అడిగారు.. దానికి ఆ లెక్చరర్ భలేవాడివే ఇది నా దేహం అయ్యా అని అంటే.. అయితే ఇది నా దేశం సార్ అని అన్నారట వెంకయ్య. అంతే... క్లాస్ అంతా చప్పట్లు. 
 
అలా కాశ్మీర్ కోసం లెక్చరర్‌ని ఎదిరించిన ఆ నాయుడు గారు.. ఈ రోజు అదే కాశ్మీర్ పునర్విభజన బిల్లుని రాజ్యసభ చైర్మన్ హోదాలో ఆమోదిస్తారని ఆయన కలలో కూడా ఊహించి వుండరు. వారి వీజీవితంలో ఇది మరపురాని రోజు.