1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (17:31 IST)

ఆధ్యాత్మిక బాట పట్టిన శశికళ : రాజకీయాలకు స్వస్తిపలికినట్టేనా? (video)

తన స్నేహితురాలు, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలైన వీకే శశికళ తమిళనాడు రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. ఆమె ఆడుగు పెట్టే సమయానికి రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా వచ్చాయి. దీంతో ఆమె రాజకీయాల్లో చక్రం తిప్పుతారని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
అయితే, అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయాల నుంచి బయటపడిన ఆమె ఇప్పుడు ఆధ్యాత్మిక జీవనంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆధ్యాత్మిక పర్యటన చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. 
 
గురువారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చెన్నైలోని టి.నగర్‌లో ఉన్న అగస్తీశ్వరాలయంలో జరిగే పూజల్లో శశికళ పాల్గొంటారు. ఈ నెల 15 నుంచి తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనకు బయలుదేరుతారని ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
 
మరోవైపు, వచ్చే నెల ఆరో తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార అన్నాడీఎంకే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇప్పటికే ఆరుగురు సభ్యులతో కూడిన జాబితా విడుదల కాగా, బుధవారం సాయంత్రం 171 మందితో మలి జాబితా వెలువడింది. 
 
తొలి జాబితాలో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం, ఇద్దరు మంత్రులు, ఇద్దరు సిట్టింగులకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరి అంచనా లను పటా పంచలు చేస్తూ.. ముగ్గురు మినహా మిగిలిన సిట్టింగులందరికీ అవకాశం కల్పిస్తూ ఈపీఎస్‌, ఓపీఎస్‌ నిర్ణయం తీసుకున్నారు. 
 
మంత్రుల్లో నీలోఫర్‌ కపిల్‌, వలర్మతి, భాస్కరన్‌లకు అవకాశం దక్కలేదు. మిగిలిన 27 మంది మంత్రులకు మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించారు. 23 మంది మాజీ మంత్రుల సహా ఇద్దరు రాజ్యసభ సభ్యులకు కూడా ఎమ్మెల్యే సీటివ్వడం విశేషం. కేపీ మునుస్వామి, వైద్యలింగంలకు మళ్లీ అవకాశం కల్పించారు. 
 
అదేవిధంగా మంత్రి రాజేంద్రబాలాజీ నియోజకవర్గం మార్చారు. ఆయన శివకాశి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాగా, రాజపాళయానికి మార్చారు. ఇదిలా వుండగా అన్నాడీఎంకే మొత్తం 177 చోట్ల పోటీ చేయడం ఖాయ మైపోయింది.