శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జులై 2020 (18:29 IST)

వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్తనెత్తుకుని ఊరంతా తిరిగిన మహిళ..?

ఓ మహిళ వివాహేతర సంబంధం నెరపిందనేందుకు దారుణ శిక్ష విధించారు.. ఆ గ్రామస్థులు. వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం నెరపిన మహిళ పట్ల ఆ గ్రామస్థులు దాడి చేశారు. అభ్యంతరకరమైన మాటలతో దూషించారు. భర్తను భుజానికి ఎత్తుకుని ఊరంతా తిప్పమన్నారు. అంతే ఆ మహిళ అష్టకష్టాలు పడుతూ ఆ శిక్షను అనుభవించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన భార్యభర్తలు ఉపాధి కోసం గుజరాత్‌కు వెళ్లారు. అక్కడ రోజూవారీ కూలీలుగా పనిచేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా అక్కడ పనులు లేకపోవడంతో ఆదివారం స్వస్థలానికి తిరిగి వచ్చారు. 
 
ఇంటికి వచ్చాక సదరు భర్త.. తన భార్యకు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ముందు అనుమానం వ్యక్తం చేశాడు. అతను చెప్పింది నిజం అని నమ్మిన గ్రామపెద్దలు మూర్ఖంగా.. ఎలాగైనా ఆమెకు బుద్ధి చెప్పాలని నిర్ణయించారు. 
 
తప్పు చేసిందని ఆరోపిస్తూ భర్తను మోసుకుని గ్రామమంతా తిప్పాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇందుకు అంగీకరించిన బాధితురాలు భర్తను మోయలేక ఇబ్బంది పడింది. ఆమె అలా భర్తను మోసుకు వెళుతుంటే.. వెనకాల అల్లరి చేస్తూ, దారుణంగా తిట్టేస్తూ, కొట్టేస్తూ గ్రామస్తులు పైశాచిక ఆనందం పొందారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. పోలీసుల వరకు చేరింది. దీంతో పోలీసులు బాధితురాలి భర్తతో పాటు ఏడుగురు గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.