1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Devotee who threatened God Shiva, what happened in the end?

పరమేశ్వరుడినే బెదిరించిన భక్తుడు, చివరికి ఏమయ్యాడు?

Devotee
రుద్రపశుపతి అనే గొప్ప భక్తుడు అమాయకుడు. ఈతడు ప్రతిరోజూ శివలయానికి వెళుతుంటాడు. అక్కడ కథలూ, పురాణాలు వింటూ వుండేవాడు. ఎవరు ఏ కథ చెప్పినా దాన్ని నిజమేనని నమ్మేవాడు. ఇక పురాణాలల్లో భగవంతుని లీలలు వింటూ తరించేవాడు. అలా ఓ రోజు గుడిలో హరికథా కాలక్షేపం జరుగుతోంది. ఆ కథలో శివుడు క్షీరసాగరమథన సమయంలో హాలాహలం రాగా ఆ విషాన్ని లోక కళ్యాణం కోసం ఓ గుళికలాగా మింగేశాడు.
 
అది స్వామి కంఠంలోనే ఉండిపోయింది. అందుకే ఆయనకు గరళకంఠుడు అనే పేరొచ్చింది అని చెప్పుకుంటూపోతున్నాడు. ఆ కథ విని ఆ భక్తుడు.. అయ్యో... ఎంతపని జరిగింది. అంతమంది దేవతలుండగా శివుడే ఎందుకు దాన్ని మింగాడు. పాపం ఆ విషం కంఠంలో ఉంచుకుని ఎంత బాధపడుతున్నాడో కదా అంటూ వేగంగా శివాలయానికి వెళ్లాడు.
 
అక్కడ ఉన్న స్వామి వద్దకు వెళ్లి స్వామీ... నువ్వు విషం మింగావట కదా. ఆ విషాన్ని ఉమ్మెయ్యి. ఉమ్ముతావా లేదా అంటూ హఠం వేసుకుని స్వామి ఒడిలో కూర్చున్నాడు. కూర్చున్నవాడు ఊరకే ఉండక ఒక పదునైన కత్తి తీసుకొని తన కంఠానికి ఆనించుకుని, నువ్వు ఆ విషాన్ని కనుక ఉమ్మెయ్యకపోతే నేనిక్కడే నా కంఠాన్ని ఈ కత్తితో నరుక్కుంటాను అని స్వామిని బెదిరించాడు.
 
ఆ అమాయక భక్తుడు అంతపనీ చేసేలాగున్నాడని శివుడు అతని భక్తికి ప్రత్యక్షమై అతణ్ణి తనలో ఐక్యం చేసుకున్నాడు. ఇలా ఒకరూ, ఇద్దరూ కాదు, ఎందరో అమాయక భక్తులు స్వామిని నిష్కల్మషభక్తితో సేవించి తరించారు.
About Writer
సిహెచ్