1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 4 ఫిబ్రవరి 2021 (21:23 IST)

పరమేశ్వరుడినే బెదిరించిన భక్తుడు, చివరికి ఏమయ్యాడు?

రుద్రపశుపతి అనే గొప్ప భక్తుడు అమాయకుడు. ఈతడు ప్రతిరోజూ శివలయానికి వెళుతుంటాడు. అక్కడ కథలూ, పురాణాలు వింటూ వుండేవాడు. ఎవరు ఏ కథ చెప్పినా దాన్ని నిజమేనని నమ్మేవాడు. ఇక పురాణాలల్లో భగవంతుని లీలలు వింటూ తరించేవాడు. అలా ఓ రోజు గుడిలో హరికథా కాలక్షేపం జరుగుతోంది. ఆ కథలో శివుడు క్షీరసాగరమథన సమయంలో హాలాహలం రాగా ఆ విషాన్ని లోక కళ్యాణం కోసం ఓ గుళికలాగా మింగేశాడు.
 
అది స్వామి కంఠంలోనే ఉండిపోయింది. అందుకే ఆయనకు గరళకంఠుడు అనే పేరొచ్చింది అని చెప్పుకుంటూపోతున్నాడు. ఆ కథ విని ఆ భక్తుడు.. అయ్యో... ఎంతపని జరిగింది. అంతమంది దేవతలుండగా శివుడే ఎందుకు దాన్ని మింగాడు. పాపం ఆ విషం కంఠంలో ఉంచుకుని ఎంత బాధపడుతున్నాడో కదా అంటూ వేగంగా శివాలయానికి వెళ్లాడు.
 
అక్కడ ఉన్న స్వామి వద్దకు వెళ్లి స్వామీ... నువ్వు విషం మింగావట కదా. ఆ విషాన్ని ఉమ్మెయ్యి. ఉమ్ముతావా లేదా అంటూ హఠం వేసుకుని స్వామి ఒడిలో కూర్చున్నాడు. కూర్చున్నవాడు ఊరకే ఉండక ఒక పదునైన కత్తి తీసుకొని తన కంఠానికి ఆనించుకుని, నువ్వు ఆ విషాన్ని కనుక ఉమ్మెయ్యకపోతే నేనిక్కడే నా కంఠాన్ని ఈ కత్తితో నరుక్కుంటాను అని స్వామిని బెదిరించాడు.
 
ఆ అమాయక భక్తుడు అంతపనీ చేసేలాగున్నాడని శివుడు అతని భక్తికి ప్రత్యక్షమై అతణ్ణి తనలో ఐక్యం చేసుకున్నాడు. ఇలా ఒకరూ, ఇద్దరూ కాదు, ఎందరో అమాయక భక్తులు స్వామిని నిష్కల్మషభక్తితో సేవించి తరించారు.