మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (10:39 IST)

శ్రీశైలంలో దారుణం.. చిన్న గొడవ.. నిండు ప్రాణాలు బలి..

శ్రీశైలంలో దారుణం జరిగింది. చిన్న గొడవ ఏకంగా నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మంగళవారం శ్రీశైలం ఆర్డీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఓ సత్రంలో సిబ్బందికి, భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరు  మృతి చెందారు.
 
వివరాల్లోకి వెళితే..  గుంటూరు జిల్లా పిచ్చికలపాలెం గ్రామానికి చెందిన నలుగురు భక్తులు శ్రీశైలానికి వచ్చారు. దర్శనం తర్వాత మధ్యాహ్నం సమయంలో కాకతీయ సత్రానికి వెళ్లారు. భోజనం వడ్డించమని సిబ్బందిని కోరగా.. వారు నిరాకరించారు. భోజన సమయం ముగిసిందని.. బఫే పద్ధతిలో మీరే వడ్డించుకోవాలని సత్రం ఇంచార్జి కందిమల్ల శ్రీనివాసరావు సూచించారు. ఆయన సమాధానంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారితీసింది. తోపులాట జరిగింది. శ్రీనివాసరావును భక్తులు తోసివేయడంతో ఆయన కిందపడ్డారు. తలకు గాయం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఐతే మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు విడించారు. మృతుడు శ్రీనివాసరావు స్వస్థలం గుంటూరు జిల్లా చిలుకలూరిపేట మండలం దండముడి గ్రామం. ఏడేళ్లుగా ఆయన శ్రీశైలంలోని సత్రంలో పనిచేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.