ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 23 ఏప్రియల్ 2022 (15:24 IST)

ఇలా చేసిన వారిని నేను రక్షిస్తాను: శనీశ్వరుడు

త్రేతాయుగంలో రఘువంశ విఖ్యాతుడు, సప్తద్వీపాలకు అధిపతి అయిన దశరధుడు అనే చక్రవర్తి వున్నాడు. అతడు ఒకనాడు పురోహితులు ఇలా చెప్పగా విన్నాడు. రాజా... 12 ఏళ్లు దుర్భిక్షము సంభవించబోవుతున్నది. దీనికి కారణం ప్రస్తుతం కృత్తికా నక్షత్రంలో సంచరిస్తున్న శని, రోహిణిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని పర్యవసానం దేవదానవులకు భయము గొలిపే ఉత్పాతమే అన్నారు.

 
అది విని దశరధ మహారాజు దీని నుండి తప్పించుకునేందుకు ఉపాయం ఏమిటని ప్రశ్నించాడు. వశిష్టాది రుషి ప్రముఖులకు, బ్రహ్మరుద్రాదులకే అది సాధ్యమని చెప్పారు. అది విన్న కోసలాధీశుడు ధనుర్భాణములు ధరించి రథమెక్కి నక్షత్ర మండలానికి సమీపించాడు. ఆయన అలా సూర్యమండలము దాటి దానికి పైనున్న రోహిణిని ప్రవేశించే శనిపై సంహాస్త్రము ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విధంగా క్రోధపూరితుడై వున్న రాజును చూసి శని రౌద్రాకారుడై నవ్వి ఇలా అన్నాడు.

 
ఓ రాజా... నీ పౌరుషము భయంకరమైనది. నీకు కావలసినవేమిటో కోరుకో అని అన్నాడు. అప్పుడు దశరధుడు ఇట్లా అన్నాడు. ఇది మొదలు నీవెవ్వరినీ బాధింపకుము. ద్వాదశవర్షదుర్భిక్షమికపై రాకుండా చేయుము అని అన్నాడు. శని వల్ల వరము పొందినవాడై దశరథుడు... శనీశ్వరుడిని ఇలా స్తుతించాడు. 

 
నమః కృష్ణాయ నీలాయ శశిఖండ నిభాయచ
నమో నీల మధూకాయ నీలోత్పల నిభాయచ
నమో నిర్మాంసదేహాయ దీర్ఘ శ్రుతి జటాహచ
నమో విశాల నేత్రాయ శుష్కోదర భయానకః
అని పరిపరి విధాలుగా శనిని కొన్ని శ్లోకములతో ప్రార్థించాడు. అందుకు శని సంతోషించి రాజా... నీవిలా స్తుతించినట్లు ఈ కథ విన్నవారికి ఎట్టి బాధలు లేకుండా నేను రక్షిస్తానని చెప్పి అంతర్థానమయ్యాడు.