శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

వీర బాదుడుతో వ్యాధి మాయం చేస్తా....

WD
ఏదినిజంలో శీర్షికలో భాగంగా... మీకు ఓ వినూత్న చికిత్సా పద్ధతిని గురించి తెలియజేయబోతున్నాం. ఈ చికిత్సా పద్థతిలో రోగులను పిడి గుద్దులు గుద్దటం లేదా బలంగా తన్నటం ద్వారా వ్యాధిని నయం చేయటం జరుగుతుంది. ఇలా చావబాదే ప్రక్రియలో రోగుల వ్యాధిని నయం చేస్తానని చెపుతున్నాడు ఛత్తీస్‌గఢ్‌కి చెందిన మాన్సారామ్.

ఈ వార్త మా చెవినబడిన మరు క్షణం... మేము ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరాం. రాష్ట్ర రాజధాని అయిన రాయ్‌పూర్‌కు 75 కిలోమీటర్ల దూరంలోనూ, ధమాత్రి పట్టణానికి 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న లాడెర్ గ్రామంలో సదరు చికిత్స చేసే వ్యక్తి నివాసం అని తెలుసుకున్నాం. ఆ గ్రామానికి చేరుకున్న మాకు... అక్కడ వేల మంది చికిత్సకోసం ఎదురుచూస్తుండటం కన్పించింది. మేము చూస్తుండగానే కొద్దిసేపటికి.... మాన్సారామ్ గంభీరంగా బయటకు వచ్చి అక్కడే ఉన్న ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ తర్వాత వరుసక్రమంలో రోగులను పిడిగుద్దులు గుద్దటం... కాళ్లతో ఇష్టం వచ్చినట్లు శక్తి కొద్దీ ఈడ్చి తన్నటం ప్రారంభించాడు. మిగిలిన రోగులు తమ వరుస ఎప్పుడు వస్తుందా... అని తన్నించుకునేందుకు ఎదురుచూస్తున్నారు.
WD


తాను ఎటువంటి రోగాన్నైనా మటుమాయం చేస్తానని మాన్సారామ్ చెపుతున్నాడు. అంతేకాదు అతను ఈ చికిత్సను ఎందుకు? ప్రారంభించాడన్న సంగతిని మాకు చెప్పాడు. మూడేళ్ల క్రితం దాకా తాను ఓ సామాన్య రైతుననీ... అయితే ఒకనాటి రాత్రి ఓ దేవతామూర్తి తనకు కలలో కన్పించి రోగులకు ఇలా చికిత్సను చేయమని ఆదేశించిందని మాతో చెప్పాడు. అంతేకాదు తాను గత ఏడాదిగా ఎటువంటి ఆహారాన్ని భుజించటంలేదనీ... తనకు ఆయా దేవతామూర్తులు శక్తిని ప్రసాదిస్తున్నారని అంటున్నాడు.
WD
చికిత్సకోసం అక్కడికి వచ్చిన ఎంతోమంది రోగులతో మేము మాట్లాడాం. వారి మాటల ద్వారా మాకు తెలిసిన సంగతి ఏమిటంటే... అక్కడి వచ్చినవారిలో ఎక్కువ మంది చికిత్సకోసం మొదటిసారిగా వచ్చినవారన్న విషయం. తమ బాగోగులను కోరే వ్యక్తుల ద్వారా మాన్సారమ్ గురించి తెలుసుకుని వారు అక్కడికి వచ్చారు. ప్రతి ఒక్క రోగి ఈ చికిత్సకోసం అక్కడికి మూడుసార్లు రావాల్సి ఉంటుంది. అలా మూడుసార్లు తన వద్దకు వచ్చి చికిత్స పొందితేనే రోగం నయమవుతుందని అతను నమ్మబలుకుతున్నాడు.

మాన్సారామ్ నుంచి చికిత్సను పొందిన రోగులు అతను ఉచితంగా వైద్యం చేస్తాడని మాతో అన్నారు. అయితే వారు పెద్దమొత్తంలో ఆయా వస్తువులను అతనికి సమర్పించటాన్ని మేము కళ్లారా చూశాం. చికిత్సను మూడుసార్లు తప్పక తీసుకోవాలి కనుక మాన్సారామ్‌కు మూడుసార్లు ఇటువంటి ముడుపులు అందుతున్నాయి.
WD


అయితే ఈ చికిత్స చేయించుకుంటున్నవారిలో అధికులు పేదవారు, నిరక్షరాస్యులు.. ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో లేనివారుగా మేము గమనించాం. ఈ అసహాయతే వారిని మాన్సారామ్ ఉచ్చులో పడేయటానికి కారణమవుతోంది. ఈ విశ్వాసంపై మీరేమనుకుంటున్నారో మాకు తప్పక రాయండి.