గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 17 మే 2016 (15:50 IST)

తిరుచానూరు పద్మావతి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

సిరుల తల్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకున అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి కోయిల్‌ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి వస్తువులను నీటితో శుద్ధి చేశారు. 
 
నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మే 19వ తేదీ అంకురార్పణతో వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 
 
ఉత్సవాల్లో భాగంగా మే 21వ తేదీన ఉదయం స్వర్ణ రథోత్సవం కన్నుపండువగా జరుగనుంది. సాయంత్రం 3 గంటల నుంచి 4.30 గంటల మధ్య శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని తితిదే నిర్వహించనుంది. అలాగే రాత్రి 7 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అమ్మవారిని నాలుగు మాడా వీధుల్లో ఊరేగించనున్నారు.