బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 21 ఏప్రియల్ 2021 (22:04 IST)

హనుమంత వాహనంపై శ్రీరామచంద్రుని కటాక్షం

తిరుమ‌ల‌: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారంనాడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హ‌నుమంత వాహ‌నసేవ జ‌రిగింది. ఈ సందర్భంగా  శ్రీ‌రాముల‌వారు త‌న ప్రియ‌భ‌క్తుడైన‌ హనుమంత వాహ‌నంపై ఆల‌య మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు.

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు శ్రీ‌రాముని మూపున వహించి దర్శనమిస్తారు. గురు శిష్యులైన‌ శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వీరిని ద‌ర్శించిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. రాత్రి 10 నుండి 11 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా చేప‌డ‌తారు. 
 
ఏప్రిల్ 22న శ్రీరామ పట్టాభిషేకం...
ఏప్రిల్ 22వ‌ తేదీన గురువారం రాత్రి 8 నుండి 9 గంటల వ‌ర‌కు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమంలో టిటిడి అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.