శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (10:09 IST)

తితిదే శుభవార్త... తిరుమల యాత్రను వాయిదా వేసుకోండి..

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఊరటనిచ్చే కబురు చెప్పింది. టికెట్లు బుక్ చేసుకుని కరోనా కారణంగా రాలేకపోయిన భక్తులు 90 రోజుల్లో ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపింది.
 
అలాగే దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇక, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది.
 
మరోవైపు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తగ్గించాలని టీటీడీ యోచిస్తోంది. మే నెలకు సంబంధించి రూ. 300 దర్శన టికెట్ల కోటాను రేపు (మంగళవారం) ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. అయితే, కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో టికెట్ల కోటాను రోజుకు 25 వేల నుంచి 15 వేలకు తగ్గించినట్టు సమాచారం.
 
మరోవైపు, దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచించింది. ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలను అనుసరించాల్సిందిగా సూచించింది. కరోనా వ్యాప్తి వేగంగా ఉండటంతో ఏప్రిల్‌ 11 నుంచి టైంస్లాట్‌ టోకెన్ల కోటాను కూడా రద్దు చేశారు.