1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 1 జనవరి 2022 (21:49 IST)

ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించా: టిటిడి ఈవో

ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు టిటిడి ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని టీటీడీ ఈవో దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులందరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని చెప్పారు. నూతన సంవత్సరం కావడంతో ఉదయం 2గంటలకే ప్రత్యేక ప్రవేశ దర్శనం పెట్టామన్నారు.

 
అలాగే తిరుపతిలోని చిన్న‌పిల్ల‌ల‌ ఆసుపత్రి గురించి కూడా  మాట్లాడారు. పుట్టుక‌తో వ‌చ్చే గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ను శ‌స్త్రచికిత్స‌ల ద్వారా స‌రిచేసేందుకు 2020, అక్టోబ‌రు 11న ముఖ్య‌మంత్రివ‌ర్యుల చేతులమీదుగా ఈ ఆసుప‌త్రిని ప్రారంభించిన‌ట్టు తెలిపారు. 

 
పేద కుటుంబాల వారికి ఈ ఆసుప‌త్రి ఆస‌రాగా నిలుస్తుంద‌న్నారు. న‌వంబరు 11 నుండి 2 నెల‌లుగా శ‌స్త్రచికిత్స‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు 45 శ‌స్త్రచికిత్స‌లు జ‌రిగాయ‌ని, వీటిలో 50 శాతానికి పైగా ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీలు కాగా మిగ‌తావి క్యాథ్ ల్యాబ్ ద్వారా చేశార‌ని చెప్పారు.

 
శ‌స్త్రచికిత్స‌ల కోసం 200 పైగా వెయిటింగ్ లిస్టు ఉంద‌ని, వారానికి 20 చొప్పున చేసేందుకు ప్ర‌ణాళిక రూపొందించామ‌ని తెలిపారు. ఇక్క‌డి డాక్ట‌ర్లు అంకిత‌భావంతో సేవలు అందిస్తున్నార‌ని చెప్పారు. మ‌రిన్ని వ‌స‌తులు పెంచ‌డంతోపాటు అవ‌స‌ర‌మైన అధునాత‌న ప‌రిక‌రాలు స‌మ‌కూర్చుతామ‌ని తెలిపారు. మ‌రో మెట్టుగా త్వ‌ర‌లో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణానికి చ‌ర్య‌లు మొద‌లుపెట్టామ‌న్నారు.