1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (13:13 IST)

అమ్మకాల ఒత్తిడి... పడిపోయిన అదానీ గ్రూపు షేర్లు.. స్టాక్ మార్కెట్ డౌన్

BSE
బాంబే స్టాక్ మార్కెట్ నష్టపోయింది. అదానీ గ్రూపు షేర్లు శుక్రవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు వచ్చిన అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు ఇంట్రాడేలో సుమారు 10 శాతం నష్టాలను ఎదుర్కొంది. దీంతో 3050.90 కనిష్ఠ ధరను బీఎస్ఈలో నమోదు చేసింది. 
 
ప్రస్తుతం రూ.3,100 వద్ద ట్రేడవుతోంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌లో ఒక్కో షేరును రూ.3,112-3,276 ధరలో ఆఫర్ చేస్తుండగా, మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధరకే షేర్ లభిస్తోంది. అటు అదానీ ట్రాన్స్ మిషన్ 17 శాతం నష్టపోగా, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ సైతం సుమారు 10 శాతం వరకు ఇంట్రాడేలో నష్టపోయింది. 
 
అదానీ గ్రూప్‌పై ప్రతికూల సెంటిమెంట్‌కు తోడు, బడ్జెట్‌కు ముందు మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం నిఫ్టీ 280 పాయింట్లు నష్టపోయి 17,550 వద్ద, సెన్సెక్స్ 1,000 పాయింట్ల నష్టంతో 59278 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.