మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2016 (13:19 IST)

సింధు విజయం కోసం రాష్ట్రంలో ప్రార్థనలు... ఆల్ ది బెస్ట్ చెప్పిన క్రీడా మంత్రి

రియో ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భాగంగా గురవారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ సెమీస్‌లో భారత షట్లర్ పీవీ సింధు తన ప్రత్యర్థిని ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం రాత్రి జరిగే ఫైనల్ పోరుల

రియో ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భాగంగా గురవారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ సెమీస్‌లో భారత షట్లర్ పీవీ సింధు తన ప్రత్యర్థిని ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం రాత్రి జరిగే ఫైనల్ పోరులో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మరిన్‌తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో కూడా సింధు విజయం సాధించి దేశానికి బంగారు పతకం సాధించి పెట్టాలని 130 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. పీవీ సింధు తెలుగమ్మాయి కావడంతో ఆమె విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తున్నారు.
 
హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ అభయాంజనేయస్వామి ఆలయంలో ఫిల్మ్‌నగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 కిలోల పసుపు, కుంకుమతో రాంగోపాల్‌పేట కార్పొరేటర్‌ అరుణ శ్రీనివాస్‌గౌడ్‌ ప్రత్యేక పూజలు చేశారు. సింధు విజయాన్ని కాంక్షిస్తూ ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానంలో జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణ, ఆలయకమిటీ జనరల్‌ సెక్రటరీ ప్రత్యేకపూజలు నిర్వహించారు.
 
సింధు విజయం సాధించాలని లాల్‌ దర్వాజా, కవాడిగూడలో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. పీవీ సింధు విజయాన్ని కాంక్షిస్తూ నల్గొండ జిల్లా పానగల్లు ఛాయాసోమేశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సింధు పేరిట అర్చన చేశారు. తిరుపతిలో సింధు విజయాన్ని కాంక్షిస్తూ అభిమానులు పూజలు చేశారు. అలిపిరి శ్రీవారి పాదాల మండపం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
మరోవైపు.. రియో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిని పీవీ సింధుకూ కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్ రాథోడ్ ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. సింధు గోల్డ్ మెడల్‌తో తిరిగి రావాలని ఆకాంక్షించారు. అంకితభావంతో సింధు ఆడిందని, దేశ ప్రతిష్టను పెంచినందుకు ఆయన అభినందించారు.