గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (12:56 IST)

రాజెవరు గోపాలా..! ఆంధ్రా ఆక్టోపస్‌కు భలే డిమాండ్

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లగడపాటి రాజగోపాల్ అంటే తెలియని వారుండరు. సర్వే నిపుణుడుగా, ఆంధ్రా అక్టోపస్‌గా మంచి పేరుంది. అలాగే, రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడి గత నాలుగున్నరేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అంటే ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 
 
కానీ, ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై సర్వే చేసి ఫలితాలను వెల్లడిస్తుంటారు. పైగా, ఆయన వెల్లడించే సర్వే ఫలితాలు నూటికి 80 శాతం మేరకు కరెక్టుగా ఉంటాయి. దీంతో ఆయన సర్వే ఫలితాల కోసం సాధారణ పౌరుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు.  ఈ నేపథ్యంలో తలెంగాణ రాష్ట్ర ఎన్నికలు వచ్చే నెల 7వ తేదీన జరుగనున్నాయి. 11వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందస్తు ఫలితాలపై పలురు రాజకీయ నేతలు లగడపాటి వద్ద ఆరా తీస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన అగ్ర నేతలతో పాటు బరిలో నిచిన అభ్యర్థులు, కాంట్రాక్టర్లు, మీడియా సంస్థల వారు లగడపాటికి ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. 
 
గతంలో ఆయన చేసిన సర్వేలన్నీ నూటికి నూరుపాళ్లు నిజమయ్యాయి. ఈ కారణంగానే ఆయన నుంచి సమాచారం తెలుసుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందా? లేదా? తెలుసుకోవాలని ప్రధాన పార్టీల అగ్ర నాయకులు ఆయనను సంప్రదిస్తున్నారు. వ్యక్తిగతంగా తాము విజయం సాధిస్తామా? లేదా? సర్వే చేసి పెట్టాలని పలువురు అభ్యర్థులు అడుగుతున్నారు. వ్యాపారవేత్తలు, బడా కాంట్రాక్టర్లు ఎన్నికలప్పుడు అన్ని ప్రధాన పార్టీలకు ఎంతోకొంత విరాళాలు ఇస్తుంటారు. 
 
అయితే గెలిచే పార్టీతో ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఆ పార్టీ నాయకులకు ఎక్కువగా, ఓడిపోయే పార్టీకి తక్కువగా ఇస్తుంటారు. అలాంటివారు కూడా లగడపాటి అంచనా ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే ప్రభుత్వంలో కీలక పదవుల కోసం ప్రయత్నిస్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా ఆయనను సంప్రదిస్తుండటం గమనార్హం.
 
దీనిపై లగడపాటి స్పందిస్తూ, నామినేషన్ల ఘట్టం ముగిసిన వారం రోజుల తర్వాత అంటే పోలింగ్‌కు మరో వారం రోజుల ముందుగానే ఈ సర్వే నిర్వహిస్తానని చెప్పారు. వ్యక్తిగతంగా అభ్యర్థుల గెలుపోటములపై సర్వే చేయించబోనని, రాష్ట్ర స్థాయిలోనే ఈ సర్వే ఉంటుందని తెలిపారు. ఈ సర్వే ఫలితాలను డిసెంబరు 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే వెల్లడిస్తానని తెలిపారు. ఈ దఫా తెలంగాణతో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వే చేయించనున్నారు.