ఆన్లైన్లో రేటింగ్ ఇస్తే డబ్బులు వస్తాయన్న ఆశ.... ఏకంగా రూ.54 లక్షలు గోవిందా
ఒక ఐటీ ఉద్యోగి సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. బ్రాండెడ్ దుస్తులకు ఆన్లైన్లో రేటింగ్ ఇస్తే భారీగా కమిషన్ వస్తుందన్న ప్రకటన నమ్మిన ఓ ఐటీ ఉద్యోగి ఏకంగా రూ.54 లక్షలను మోసపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని పటాన్చెరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
పటాన్చెరులో నివాసముంటున్న బాధితుడు హెచ్.సి.ఎల్లో పనిచేస్తున్నాడు. సెప్టెంబరు 19వ తేదీన అతడి వాట్సాప్ నంబరుకు గుర్తుతెలియని నంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. తాము పంపే లింకును వస్తువులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ సంపాదించుకోవచ్చని ఆ సందేశంలో ఉంది. దీనిని నమ్మిన ఆ టెక్కీ, మెసేజ్లో ఉన్న టెలిగ్రామ్ లింకుపై క్లిక్ చేసి గ్రూపులో చేరిపోయాడు.
మొదటగా నిర్వాహకులు చెప్పిన రెండు టాస్క్ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత అతని బ్యాంకు ఖాతాలో రూ.5,000 జమ అయ్యాయి. దీంతో అతడికి నమ్మకం కుదిరింది. మరింత డబ్బు సంపాదించాలనే అత్యాశతో మరిన్ని టాస్క్లు చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఈసారి టాస్క్లు చేయాలంటే ముందుగా డబ్బు చెల్లించి వాటిని కొనుగోలు చేయాలని సైబర్ నేరగాళ్లు సూచించారు.
వారి మాటలు నమ్మిన బాధితుడు, తొలుత రూ.12,500 చెల్లించాడు. ఆ తర్వాత విడతలవారీగా టాస్క్ కొనుగోలు, క్రెడిట్ స్కోర్, వీఐపీ చానల్ యాక్టివేషన్, నగదు విత్ డ్రా ఫీజుల పేరుతో మొత్తం రూ.54,67,488 వరకు వారికి ఆన్లైనులో బదిలీ చేశాడు.
అతడి ఆన్లైన్ ఖాతాలో లాభంతో కలిపి రూ.70 లక్షలు ఉన్నట్లు కనిపించడంతో, ఆ డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ డబ్బును విత్ డ్రా చేయాలంటే మరో రూ.8 లక్షలు చెల్లించాలని సైబర్ ముఠా డిమాండ్ చేయడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.