సోమవారం, 10 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 మార్చి 2025 (17:48 IST)

సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే పార్టీలో చేరాను : విజయశాంతి

vijayashanthi
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు సినీ నటి విజయశాంతి తెలిపారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టిక్కెట్‌ను కేటాయించింది. తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ఒకరు విజయశాంతి. దీంతో ఆమె సోమవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం తనకు గతంలో అవకాశం ఇచ్చినా వద్దని చెప్పి, ముందు పని చేస్తానని చెప్పానని గుర్తు చేశారు. తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేశానని, కానీ, ఏనాడూ ఇది కావాలని అడగలేదన్నారు. గంతలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేశానని తెలిపారు. 
 
అంతేకాకుండా, సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. పార్టీ అధిష్టానం ఎపుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ తెలియదన్నారు. ఎవరికి, ఎపుడు ఏ బాధ్యత ఇవ్వాలో అపుడే ఇచ్చి పని చేయించుకుంటుందని ఆమె చెప్పారు. పార్టీలో ఉండి పదవులు రానివారు కాస్త ఓపికతో ఉండాలని సూచించారు. 
 
పార్టీ తనకు అవకాశం ఇచ్చినపుడే మాట్లాడాలని అనుకున్నానని, అప్పటివరకు పని చేసుకుంటూ వెళ్లాలని భావించినట్టు చెప్పారు. ఒక అవకాశం కోసం ఎదురు చూశానని, ఇపుడు తనకు ఆ అవకాశం వచ్చిందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఒక పద్దతి ఉంటుందని, దాని ప్రకారమే అందరూ పని చేయాలని ఆమె సూచించారు. ప్రజల సమస్యకు పరిష్కారం చూపించే దిశగా తాము పోరాడుతామన్నారు. ఒక ఆలోచన, ముందు చూపుతో రాష్ట్ర ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించి వాటిని అమలు చేస్తుందన్నారు.