మా ఇంట్లో దొంగ గంటన్నరపాటు హల్చల్ చేశాడు : ఎంపీ డీకే అరుణ (Video)
తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ డీకే అరుణ నివాసంలో శనివారం రాత్రి దొంగలుపడ్డారు. ఇంట్లోని సీసీ కెమెరాల కనెక్షన్ కట్ చేసి ఇంట్లోకి ప్రవేశించిన దొంగడ... గంటన్నరపాటు తమ ఇంట్లోనే ఉన్నాడని వెల్లడించారు. అయితే, ఆ దొంగ వస్తువులేమీ తీసుకెళ్లలేదని ఆమె తెలిపారు. తమకు భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, గత రాత్రి తమ ఇంట్లోకి ఓ దండగుడు చొరబడ్డారని తెలిపారు. కిచెన్, డైనింగ్ హాలులో ఉన్న సీసీటీవీ కెమెరాల కనెక్షన్ కట్ చేశాడని తెలిపారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి దాదాపు గంటన్నరపాటు తమ ఇంట్లోనే ఉన్నాడని వివరించారు. తాను ఇప్పటికే చాలాసార్లు భద్రత కోసం అడిగానని, కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. తమ కుటుంబానికి భద్రత చాలా అవసరమని ఆమె స్పష్టం చేశారు.
కాగా, శనివారం రాత్రి తమ ఇంట్లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి.. చోరీ కోసం వచ్చి ఉంటే ఏదైనా పట్టుకెళ్లి ఉండాలి.. కానీ, అలా జరగలేదు అని డీకే అరుణ వెల్లడించారు. ఇప్పటికైనా తమ భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తన తండ్రిపై దాడి జరిగిన సంగతి తెలిసిందేనని, తాజా ఘటనతో తమ కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందుతున్నారని ఆమె గుర్తుచేశారు.