Telangana Cold Wave Alert: చలి-పులి.. ఎముకలు కొరికే చలి.. చలిగాలులు అలెర్ట్
చలిగాలులలో తెలుగు ప్రజలు గజగజా వణికిపోతుంటే రాబోయే పదిరోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోయి చలి తీవ్రత పెరుగుతోంది. కొన్నిచోట్ల సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశముందని... ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో రాబోయే రెండ్రోజుల్లో ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయికి చేరుకుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. చలితీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ మెటలర్జికల్ సెంటర్.
నవంబర్ 11 నుండి 19 వరకు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటాయని హెచ్చరించారు. ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు.
మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎముకలు కొరికే చలి ఉంది. మినుమలూరులో అత్యల్పంగా 10 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.