మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (08:42 IST)

దప్పిక తీర్చుకునేందుకు వచ్చిన కోతి... ఉరివేసి కొట్టి చంపిన కిరాతకులు.. ఎక్కడ?

దప్పిక తీర్చుకునేందుకు వచ్చిన ఓ కోతిని కొందరు కిరాతకులు పట్టుకుని ఉరివేసి కొట్టి చంపిన ఘటన ఒకటి తెలంగాణ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లా వేంనూరు మండలంలోని అమ్మపాలెంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఈ నెల 26న సాధు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్న తొట్టెలో నీళ్లు తాగేందుకు ప్రయత్నించిన ఓ కోతి వచ్చింది. అది నీరు తాగే సమయంలో పట్టు తప్పి.. అందులో పడిపోయింది. 
 
వెంకటేశ్వరరావు మరో ఇద్దరితో కలిసి దానిని పట్టుకుని మెడకు తాడు కట్టి చెట్టుకు వేలాడదీశారు. అనంతరం కర్రలతో దారుణంగా కొట్టి చంపేశారు. వేలాడుతున్న కోతి కళేబరాన్ని సాయంత్రం వరకు అలాగే ఉంచేశారు. కోతికి ఉరేసి కొట్టి చంపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీ శాఖ అధికారులు స్పందించారు. 
 
ఈ గ్రామానికి చేరుకుని వానరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. వానరంపై దాడి చేసిన నిందితులు వెంకటేశ్వరరావు, జోసెఫ్ రాజు, గౌడెల్లి గణపతిలను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి రూ.25 వేల జరిమానా విధించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.