శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (18:14 IST)

టీఎస్సార్టీసీ బస్సుల ప్రయాణ వేళల పొడిగింపు.. మెట్రో రైళ్ల రాకపోకల్లోనూ మార్పులు

టీఎస్సార్టీసీ బస్సుల ప్రయాణ వేళలు పొడిగించారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈనెల 10 నుంచి ఉ.6 గంటల నుంచి సా.6 గంటల వరకు సడలింపులను ఇచ్చింది. దీంతో టీఎస్సార్టీసీ జిల్లాలకు నడిపే బస్సులను ఉ.6 గంటల నుంచి సా.6 గంటల వరకు తిప్పనున్నట్లు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి  తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 3,600 బస్సులను మధ్యాహ్నం 2 గంటల వరకే నడుపుతున్నామని.. వాటినే సాయంత్రం 6 గంటల వరకు తిప్పుతామని తెలిపారు.
 
హైదరాబాద్ నగరంలో ఉ.6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్సార్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. లాక్‌డౌన్ సడలింపు  టైంలో సిటీ బస్సులను తిప్పుతామన్నారు. గ్రేటర్ పరిధిలోని బస్ పాస్ కౌంటర్లన్నీ ఉ.6:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
 
అలాగే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగింపుతో హైదరాబాద్‌ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చేశారు అధికారులు. ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో సర్వీస్‌ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో సర్వీస్‌ బయలుదేరుతుంది. సాయంత్రం 6 గంటలకల్లా మెట్రో రైళ్లు టెర్మినల్ స్టేషన్ కు చేరుకోనున్నాయి.
 
కరోనా రెండో వేవ్‌  కట్టడి కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ.. పలు సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుత లాక్‌డౌన్‌ గడువు నేటివరకు వరకు ఉండగా.. మరో 10 రోజులపాటు పొడిగించింది. సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. ప్రజలు ఇళ్లు, గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంటపాటు అదనంగా సమయాన్ని సడలింపునిచ్చింది.