గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (14:21 IST)

విడాకుల కోసం దూరంగా వున్నారు... భార్య 5 నెలల గర్భవతి అని తెలిసీ...

ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలోని కొండాపూర్‌ శివారులో రెండు రోజుల క్రితం భార్య శుశ్రుతతో పాటు, రెండున్నర నెలల వయసున్న కుమారుడిని గూడూరుకు చెందిన మచ్చల రమేశ్ మద్యం తాగి హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు అతడిని విచారించగా విస్మయకర విషయాలు బయటపడ్డాయి. భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. 
 
రమేష్‌ శుశ్రుతను 2015 నవంబరులో హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నాడు. కులాలు వేరు కావడంతో రమేష్ కుటుంబ సభ్యుల ప్రమేయంతో వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకునేది. విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఆ తర్వాత శుశ్రుత పుట్టింటికి వెళ్లిపోయింది. ఎనిమిది నెలలుగా అక్కడే ఉంటోంది. కొద్ది రోజుల క్రితం కోర్టులో చివరి వాయిదా సమయంలో తాను ఐదు నెలల గర్భవతినని చెప్పడంతో కోర్టు విడాకులు మంజూరు చేయకుండా ఆపివేసింది. 
 
శుశ్రుత గర్భవతి అని అప్పటివరకూ తెలియని రమేష్ భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు. కొడుకు నామకరణానికి వెళ్లినప్పుడు తనను పట్టించుకోలేదని అత్తింటిలో గొడవపడి వచ్చేశాడు. ఫోన్‌లలో భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం నవంబర్‌లో రమేష్ తమ్ముడి పెళ్లికి తనకు పిలుపు రాకపోవడంతో కుటుంబ సభ్యులతో వైరానికి కారణం భార్యేనని ద్వేషం పెంచుకున్నాడు. 
 
దాంతో భార్యతోపాటు పసికందును చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 9వ తేదీన శుశ్రుతకు ఫోన్ చేసాడు. జరిగింది మరిచిపో, ఉప్పల్‌ డిపో వద్ద ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెడదాం రా అంటూ అని నమ్మబలికాడు. అది నమ్మి వచ్చిన భార్యను మరియు కుమారుడిని కొండాపూర్‌లో గొంతు నులిమి చంపేశాడు.

శుశ్రుత ఒంటిపై ఉన్న మంగళసూత్రం, నగలు తోపాటు ఏటియం కార్డును కూడా తీసుకున్నాడు. తర్వాత శవాలను దహనం చేసాడు. సాక్ష్యాలను మాయం చేయాలని శుశ్రుత సెల్ ఫోన్‌లను మంటల్లో పడేశాడు. ఏటియం నుండి డబ్బు డ్రా చేసి మందు తాగాడు. ఆదివారం మత్తు దిగాక పాలకుర్తి పోలీసుస్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పి లొంగిపోయాడు.