మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: సోమవారం, 5 ఆగస్టు 2019 (15:03 IST)

పక్కింటి కుర్రాడితో మాట్లాడిన భార్య... నరికి చంపేసిన భర్త..?

అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్య పక్కింటి కుర్రాడితో మాట్లాడుతోందని, అతనితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త ఆమెను అతికిరాతకంగా చంపేశాడు. భార్యతో పాటు కొడుకు, కూతుర్ని కూడా అతి దారుణంగా నరికి చంపి పరారయ్యాడు.
 
వికారాబాద్‌కు చెందిన ప్రవీణ్ కుమార్‌కు , అదే ప్రాంతానికి చెందిన చాందిని 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. ప్రవీణ్ హిందువు... చాందిని ముస్లిం. ఇద్దరూ ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు. వేరు కాపురం పెట్టారు. 15 సంవత్సరాలు బాగానే వీరి కాపురం సాగింది. అయితే గత కొన్నిరోజులుగా తన ఇంటి పక్కనే ఉన్న 18 యేళ్ళ యువకుడితో తన భార్య చాందిని సన్నిహితంగా ఉందని అనుమానించాడు ప్రవీణ్. 
 
ఇదే విషయంపై గత మూడురోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు భార్యాభర్తల మధ్య గొడవ పెద్దదైంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రవీణ్ కుమార్ ఇంట్లో ఉన్న కత్తితో అతి దారుణంగా భార్యను మొదటగా చంపాడు. ఆ తరువాత ఇద్దరు పిల్లలను కూడా నరికి చంపేశాడు. 
 
కొద్దిసేపటి తరువాత ఇంటి నుంచి పరారయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముగ్గురి హత్యలతో ఒక్కసారిగా వికారాబాద్ ప్రాంతం ఉలిక్కిపడింది.