శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 22 జనవరి 2022 (15:15 IST)

ఇంటి రుణం రూ. 30 లక్షలు, ఆపై టాపప్, పర్సనల్ లోన్: అందుకే అమీనాపురలో కుటుంబం ఆత్మహత్య

అమీనాపురలో భార్యాబిడ్డలతో కలిసి శ్రీకాంత్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలేనని అనుమానిస్తున్నారు. అతడు ఇంటిని కొనేందుకు రూ.30 లక్షల ఇంటి రుణం తీసుకున్నట్లు గుర్తించారు. దానిపై రూ. 11 లక్షల టాపప్ లోన్ కూడా తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.


ఇదికాక రూ. 7 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నాడు. వెరసి మొత్తం రూ. 48 లక్షలు, వీటికి ఈఎంఐలు కట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొని వుండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా శ్రీకాంత్- అనామిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పదేళ్లక్రితం పెద్దలు అనుమతి తీసుకుని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఏడేళ్ల కుమార్తె కూడా వుంది. కానీ ఏమైందో తెలియదు కానీ ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాదులోని అమీన్‌పూర్ వందనపురి కాలనీలో 42 ఏళ్ల శ్రీకాంత్ గౌడ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి 40 ఏళ్ల భార్య అనామిక కూడా ఓ కార్పొరేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఐతే రెండు రోజులుగా వీరు బయట కనిపించలేదు.

 
మరోవైపు అనామిక తండ్రి ఫోన్ చేసినా స్పందన లేదు. దీనితో అనుమానం వచ్చిన అనామిక తండ్రి నేరుగా వారి ఇంటికి వచ్చి తలుపు తీసేందుకు ప్రయత్నించగా లోపల గడియపెట్టి వుంది. దీనితో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా అనామిక, ఆమె కుమార్తె ఇద్దరూ మంచంపై పడి నురగలు కక్కి మరణించి వున్నారు. 

 
శ్రీకాంత్ గౌడ్ తన గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. మృతదేహాలను పరిశీలించగా వారి నుదుటున కుంకుమ బొట్లు పెట్టుకుని వున్నారు. దేవుడి పటాలను బోర్లించి పెట్టారు. ఐతే వీరి మరణానికి కారణం ఆర్థిక సమస్యలు అని ప్రాధమికంగా నిర్థారణకు వచ్చారు. ఐతే ఆధ్యాత్మిక పరంగా ఏమయినా నమ్మకాల వల్ల ఇలా చేసుకున్నారేమోనన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.