1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ , శుక్రవారం, 21 జనవరి 2022 (16:31 IST)

కేసినో, జూదం నిర్వహించామని నిరూపిస్తే రాజీనామా... ఆత్మహత్య

జనవరి 6వ తేదీ నుంచి తాను గుడివాడలో లేన‌ని, కొవిడ్ తో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్కడే ఉన్నాన‌ని మంత్రి కొడాలి నాని చెప్పారు.  ఈరోజే కేబినెట్ మీటింగ్ కు వచ్చాను. అటువంటిది చంద్రబాబు, ఆయన తొత్తులు, ఆయనకు బాకా ఊదే మీడియా.. గుడివాడలో ఏదో జరిగిపోతుందని, కేసినోలని, జూదాలని ఏవేవో అబద్ధాలను పోగేసి ప్రచారం చేస్తున్నారు.


కేసినో అంటే ఏమిటో చంద్రబాబుకు, ఆయన కొడుకు లోకేష్ కే బాగా తెలుసు. ఎందుకంటే, చంద్రబాబు కొడుకు స్విమ్మింగ్ పూల్ లో బట్టలు లేకుండా నిలబడి, మద్యం గ్లాసు పట్టుకుని, తన చుట్టూ నలుగురు మహిళల్ని అర్థనగ్నంగా నిలబెట్టుకుని.. ఏం చేశాడో ఫోటోలతో సహా అంతా చూశారు... అని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.
 
చంద్రబాబు ఏం చెబితే.. అది చూపించే డబ్బా మీడియా, కుల మీడియా ఆయనకు ఉంది. నేను ఊర్లో లేని సమయంలో గుడివాడలోని నా కళ్యాణ మండపంలో ఏదో జరిగిపోతుందని, ఎక్కడో తీసుకొచ్చిన వీడియోలు చూపించి దుష్ప్రచారం చేస్తున్నారు. రెండున్నర ఎకరాల్లో నా కళ్యాణ మండపం ఉంది.  నా కళ్యాణ మండపంలో క్యాసినోగానీ, పేకాట గానీ పెట్టానని నిరూపిస్తే.. రాజీనామా చేసి, పెట్రోలు పోసుకుని ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. ఛాలెంజ్ చేస్తున్నాను. నిరూపించలేకపోతే చంద్రబాబు, ఆయనకు తొత్తులుగా వ్యవహరించే కుక్కలు ఏం చేస్తాయో చెప్పాలి...అని కొడాలి నాని స‌వాలు చేశారు.
 
4- రాజకీయంగా చంద్రబాబు ఎప్పుడో సమాధి అయ్యారు. చంద్రబాబుకు ఎటూ సిగ్గూ, శరం లేదు, అందుకే ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు.  ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గుడివాడలో నిజనిర్థారణ కమిటీ పేరుతో చంద్రబాబు రచ్చ చేస్తున్నాడు. అక్కడ ఉద్రిక్తతలు పెంచాలని ప్రయత్నిస్తున్నాడు. నిజ నిర్థారణ కమిటీ పేరుతో వెళ్ళిన వారు ఎవరంటే... ఎప్పుడూ గెలవని వర్ల రామయ్య, విజయవాడలో ఆస్తులు ఆక్రమించి, మహిళల్ని వేధించిన బోండా ఉమ లాంటి వాళ్ళను గుడివాడకు పంపి రచ్చ చేస్తున్నారు. దీనిని పట్టుకుని చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతున్న వారు, ఆయన కుల మీడియా ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
 
సంక్రాంతి పండుగకు సంప్రదాయంగా జరిగే కోడి పందేలే గుడివాడలో కూడా జరిగాయి. ఎక్కడో డ్యాన్సులు నిర్వహిస్తున్నారని మీడియాలో వార్తలు వస్తే.. నేనే స్వయంగా స్థానిక డీఎస్పీ కి ఫోన్ చేసి, పోలీసుల్ని పంపించి అడ్డుకున్నాం. చంద్రబాబు కాదు కదా.... ఎవరొచ్చినా గుడివాడలో నన్ను ఎవరూ ఏమీ చేయలేరు...అని కొడాలి నాని చెప్పారు.
 
చంద్రబాబు ప్రచారం చేసే అబద్ధాలను కాసేపు పక్కన పెట్టి, వాస్తవాలేమిటో, గుడివాడలో ఏం జరిగిందో న్యూట్రల్ గా ఉండే  మీడియా ప్రతినిధులు వెళ్ళి అక్కడి ప్రజలను అడిగితే చెబుతారు. పూర్తి వాస్తవాలను తెలుసుకునే మీడియా ప్రజలకు అందిస్తే మంచిది. చంద్రబాబు కుల మీడియా, డబ్బా మీడియా చెప్పినట్టు గుడివాడలోని నా కళ్యాణ మండపంలో అటువంటివేవీ జరగలేదన్నది వాస్తవం అని మంత్రి పేర్కొన్నారు.