1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (12:32 IST)

భార్య కాపురానికి రాలేదని మనస్తాపం.. భర్త బలవన్మరణం.. ఎక్కడ?

కట్టుకున్న భార్య కాపురానికి రాలేదన్న మనస్తాపంతో ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్, బంజారా హిల్స్ సమీపంలోని ఎస్పీఆర్ హిల్స్ వినాయకనగర్ ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎస్‌పీఆర్‌ హిల్స్‌ వినాయకరావునగర్‌లో నివసించే కె. సాయికిరణ్‌(24) స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న హర్షను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు వీరి కాపురం బాగానే సాగింది. 
 
ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో హర్ష పుట్టింటికి వెళ్లిపోయింది. గత ఎనిమిది నెలల నుంచి అదే బస్తీలో ఉండే పుట్టింట్లో ఉంటోంది. ఇంటికి కావాలంటూ సాయికిరణ్ పలుమార్లు వెళ్లి హర్షను కోరాడు. అయినప్పటికీ ఆమె కాపురానికి తిరిగి రాలేదు. దీంతో సాయికిరణ్‌ మనోవేదనకు గురయ్యాడు. 
 
కాపురానికి రమ్మని ఆమెను అడిగినప్పుడల్లా అతడిని కించపరిచే విధంగా మాట్లాడేది. హర్ష మరో వ్యక్తితో చాటింగ్‌ చేస్తుందనే అనుమానంతో సాయికిరణ్‌ ఈనెల 28న ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు కొన ఊపిరితో ఉన్న అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.