బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జులై 2020 (08:49 IST)

ప్రేమ విఫలం? న్యూస్ చానెల్ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఓ న్యూస్ చానెల్‌లో పని చేస్తూ వచ్చిన ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఇదే న్యూస్ చానెల్‌లో పని చేస్తూ వచ్చిన మరో ఉద్యోగితో ప్రేమలో పడింది. అది విఫలం కావడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన హైదరాబాద్, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిద్దిపేటకు చెందిన పి.రాములు కుమార్తె కళ్యాణి (26) అనే యువతి ఓ న్యూస్ చానెల్‌‌లో విధులు నిర్వహిస్తూ, గత రెండేళ్లుగా అదే చానెల్‌లో పనిచేస్తున్న శివ అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. 
 
అయితే, వయసు పైబడటంతో పాటు.. తనను వివాహం చేసుకోవాలంటూ శివపై కళ్యాణి ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. దీనికి శివ నిరాకరించాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరంకావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. పైగా, ఇక తాను బతకడం వృథా అని భావించిన ఆమె, ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించింది. 
 
తన సోదరుడితో కలిసి ఆమె ఇక్కడ ఉంటుండగా, అతను విధులు ముగించుకుని వచ్చేసరికి కళ్యాణి మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరిలించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. తన కుమార్తె మృతికి శివ కారణమన్న ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామని తెలిపారు.