గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (08:55 IST)

తెలంగాణాలో నేడు కూడా వర్షాలే.. ఆ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Rains
తెలంగాణా రాష్ట్రంలో శుక్రవారం కూడా భారీ వర్షం కురువనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్రమట్టానికి ఏడున్నర కిలోమీటర్ల ఎత్తు మేరకు ప్రభావం కొనసాగుతోంది. ఈ కారణంగా వచ్చే 48గ గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషా తీరానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా మరింతగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
సముద్రమట్టం వద్ద రుతుపవన ద్రోణి జైసల్మేర్, భోపాల్, గోండియా, జగదల్‌పూర్, కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతానికి చేరుతుందని తెలిపింది. అందువల్ల శుక్రవారం కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం హైదరాబాద్ నగరంతో సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు మొదటి రెండు ప్రమాద హెచ్చరికలను జారీచేసింది. 
 
ఈ అల్పపీడన ప్రభావం కారణంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత బారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అందువల్ల ఈ జిల్లాల్లో ఆరెంజె హెచ్చరికలను జారీచేసింది. అలాగే, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పాలమూరు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో ఇక్కడ కూడా ఎల్లో హెచ్చరికను జారీచేసింది. ఈ ప్రభావం కారణంగా ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది.