1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శనివారం, 18 నవంబరు 2023 (18:09 IST)

కళ్లు తిరిగి పడిపోయిన మాట వాస్తవమే.. ఇపుడు బాగానే ఉన్నాను : కె.కవిత

kkavitha
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెలాఖరులో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అధికార భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర చిన్నాచితక పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా, తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని తిరిగి అధికారంలోకి వచ్చేందుకు భారాస నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 
 
ఆ పార్టీకి చెందిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లతో పాటు కేసీఆర్ కుమార్తె కె.కవిత కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటిక్యాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కవిత.. ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో పార్టీ నేతలు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఆమెను స్థానిక బీఆర్ఎస్ కార్యకర్త ఇంటికి తరలించి, అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. 
 
కవిత ఆరోగ్యంపై పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొనడంతో ఆమె ట్వీట్ చేశారు. అస్వస్థతకు లోనైన మాట వాస్తవమేనని, విశ్రాంతి తీసుకున్న తర్వాత తాను కోలుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ఓ చిన్నారితో ముచ్చటిస్తుండగా తీసిన వీడియోను షేర్ చేశారు. చిన్నారితో గడిపిన తర్వాత తనకు మరింత శర్తి వచ్చినట్టు అనిపించిందని ఆమె పేర్కొన్నారు. డీహైడ్రేషన్ కారణంగానే ఆమె కళ్లు తిరిగి పడిపోయారని వైద్యులు వెల్లడించారు.