ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (16:37 IST)

కూసుకుంట్లను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటాం : మంత్రి కేటీఆర్

kusukuntla - ktr
మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిస్తే తాను మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) ప్రకటించారు. తెరాస అభ్యర్థి కూసుకుంట్లకు మద్దతుగా ఆయన గురువారం ప్రచారం చేశారు. 
 
తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. కేసీఆర్‌కు మునుగోడు క‌ష్టం తెలుస‌న్నారు. 2006లో 32 మండ‌లాలు తిరుగుతూ ఆయ‌న స్వ‌యంగా పాట రాశారన్నారు. 
 
"చూడు చూడు న‌ల్ల‌గొండ‌.. గుండె నిండా ఫ్లోరైడ్ బండ" అనే పాట రాసిండని గుర్తు చేశారు. శివ‌న్నగూడెంలో నిద్రించి నాడు ఒక మాట ఇచ్చారు.. తాగునీటి మంత్రి జానారెడ్డి, సాగునీటి మంత్రి పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి అయిండు.. ఏ ఒక్క‌రూ కూడా మంచి చేయ‌లేదు.. తెలంగాణ ఏర్పడిన త‌ర్వాత‌, మీ సమ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పి, ఇచ్చిన హామీని నెర‌వేర్చారన్నారు. 
 
నల్గొండ జిల్లాలను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను దేశ ప్రధానులు సైతం పట్టించుకోలేదని మండిపడ్డారు. కానీ, సీఎం కేసీఆర్ పరిష్కరించారని చెప్పారు. ఇపుడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే రూ.18 వేల కాంట్రాక్టును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్రం కట్టబెట్టిందని ఆరోపించారు. 
 
రూ.వేల కోట్ల కాంట్రాక్టుల లాభాలతో మునుగోడు ఓటర్లను అంగడి సరుకులా కొనుగోలు చేసేందుకు సిద్ధమైన కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అన్నారు. ప్రజలకు అవసరం లేకపోయినా బలవంతంగా రుద్దిన ఎన్నిక ఇది అని మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.